
హరితాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలి
విజయవాడరూరల్: మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం–2025 కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ జక్కంపూడి వద్ద నగర వనంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 29 శాతం గ్రీనరీని స్వర్ణాంధ్ర విజన్ 2047 నాటికి 50 శాతం పెంచేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ మానసిక వికాసానికి యోగాంధ్ర దోహదపడుతున్నట్లే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలను నాటి పచ్చదనం పెంచుదామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 11 శాతం ఉన్న గ్రీనరీని 33 శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అటవీ శాఖ అధికారి జి.సతీష్, డీపీఓ పి.లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారావు తదితరులు పాల్గొన్నారు.
చెట్లతోనే మానవాళికి మనుగడ: మంత్రి సవిత
పెనమలూరు: చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని, హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కోటి మొక్కలు నాటుతున్నామని బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దిపోత్సవం సందర్భంగా గురువారం పోరంకిలో మంత్రి మొక్క నాటి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్కు అందరూ దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి హరితాంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తామని తెలిపారు. అనంతరం చెట్ల పెంపకంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
మంత్రి సత్యకుమార్ యాదవ్

హరితాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలి