
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
పమిడిముక్కల: మండలంలోని కపిలేశ్వరపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు ధ్వంసమైంది. కొడాలి నాగేంద్రబాబు అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తుండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని నాగేంద్రబాబు తెలిపాడు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పార్టీ నాయకులతో కలిసి ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటంబాన్ని పరామర్శించి, నష్టం వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అధైర్యపడవద్దని ఆదుకొంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పారదర్శకంగా క్రీడా కోటా అమలు
శాప్ చైర్మన్ రవినాయుడు
విజయవాడస్పోర్ట్స్: మెగా డీఎస్సీ క్రీడా కోటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు శాప్ అధికారులను ఆదేశించారు. నగరంలోని శాప్ కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఉద్యోగానికి అర్హత కలిగిన ఏ ఒక్క క్రీడాకారుడు నష్టపోకుండా నిష్పక్షపాతంగా, అవినీతికి తావులేకుండా ఎంపిక జరగాలన్నారు. మెగా డీఎస్సీని అడ్డుపెట్టుకుని ఇప్పటికే కొన్ని క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఫేక్ సర్టిఫికెట్లు ఎరవేసి సొమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కల్పిస్తూ ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసి క్రీడా సంఘాల ప్రతినిధులు లక్షలు కాజేస్తున్నారని అన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్నా, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాప్ ఏవో ఆర్.వెంకటరమణ, టీఎస్వో ఎస్.వి.రమణ, స్పోర్ట్స్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, మహేష్, సురేంద్ర, కిషోర్, ఏడీలు వేణు, మల్లేశ్వరిభాయ్ పాల్గొన్నారు.
స్పైసెస్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
కొరిటెపాడు(గుంటూరు): ఎగుమతులు, విలువ జోడింపు – రైతు సాధికారతను పెంచడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్పైసెస్ బోర్డు స్పైసెస్డ్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోందని స్పైసెస్ బోర్డు డీడీ ఆనంద్ దేవ్ వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్పైసెస్ బోర్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ‘ఎగుమతి అభివృద్ధి కోసం ప్రగతిశీల, వినూత్న, సహకార జోక్యాల ద్వారా సుగంధ ద్రవ్యాల రంగంలో స్థిరత్వం’ అనే ప్రధాన పథకం కింద ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. స్థిరత్వం, ఆవిష్కరణ, ఎగుమతి అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా భారతీయ సుగంధ ద్రవ్యాల రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ మే 26వ తేదీ నుంచి ప్రారంభమైందని, సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారుల కోసం స్పైస్డ్ పథకం యొక్క ఎగుమతి అభివృద్ధి, ప్రమోషన్ భాగాల కింద దరఖాస్తును ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వాటాదారులు www.indianspices. com ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం