
శాతవాహన కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే నిర్వహించాలని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ శాతవాహన కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా)ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. గతంలో చేసిన ప్రయత్నాలను ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు చేసిన పోరాటాల వల్ల వెనక్కు తగ్గాడన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఆలపాటి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అందువల్ల శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహించాలన్నారు.
ఆలపాటిపై చర్యలు తీసుకోకపోతే
ఆందోళనలు..
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు మాట్లాడుతూ.. విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తానని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎమ్మెల్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడం సిగ్గుచేటు అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించినా పోలీసులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజాపై కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించి వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి ఆలపాటి రాజాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఆలపాటి రాజాపై చర్యలు తీసుకోకపోతే శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేస్తామని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. ఐద్వా నగర కార్యదర్శి సరోజ, నగర కమిటీ సభ్యులు షకీలా, ఆశ, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కుమార స్వామి, కార్యదర్శి మాధవ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సభ్యురాలు ఇజ్ఞాడ లక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించిన ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలి
విద్యార్థి, మహిళా సంఘాల డిమాండ్