
బాస్కెట్బాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా సీ్త్ర, పురుషుల జట్లను నూజివీడులోని వీటీహెచ్ మైదానంలో సోమవారం ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడు జి.సుభాష్చంద్రబోస్ తెలిపారు. పురుషుల జట్టుకు జి.నాగబాబు, ఎస్కే యాసిన్, ఎ.తేజ, బి.సంజయ్శ్రీనివాస్, మహిళల జట్టుకు బి.ప్రభుదీపిక, షేక్ అస్రా, బి.ప్రణవి, బి.కుసుమ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు.
‘ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారా ?’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(పీడీఎస్ఓ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరికీ ఉచిత వైద్యం, వైద్య విద్య అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి, ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచిందన్నారు. ఈ విధానాలు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను, వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నాయని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా జరిపిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించే కుట్ర చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, భవనాలను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వంద శాతం సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ ప్రజావాణిలో 78 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 78 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఏబీటీఎస్ ఉదయరాణి తెలిపారు. భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలపై 47, మహిళా సంబంధిత నేరాలపై ఆరు, సైబర్ నేరాలపై ఆరు, కుటుంబ కలహాలపై నాలుగు, చోరీలపై రెండు, కొట్లాటలపై ఒకటి, ఇతర వివాదాలపై 12 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సదరు ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు డీసీపీ చెప్పారు.
6 నుంచి ఐటీఐ కౌన్సెలింగ్
గుడివాడ టౌన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కోర్సులలో చేరే విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వాహిస్తామని స్థానిక కేబీఆర్ గవర్నమెంట్ ప్రిన్సిపాల్ ఎల్. గౌరీమణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10 జీపీఏ నుంచి 5.5 జీపీఏ వరకు, మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు 5.4 జీపీఏ నుంచి 1.5 జీపీఏ కలిగిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కౌన్సెలింగ్కు వచ్చేవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆమె కోరారు.

బాస్కెట్బాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక