
యోగాను మరింత చేరువ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కళాకారులకు సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉందని యోగాను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంస్కృతిక వాస్తు శిల్పులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. ఆయుష్శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆర్టిస్ట్ థీమ్ యోగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని నాట్యాచార్యులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సమాజంలోని ప్రతివర్గానికి యోగాను చేరువచేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కళాకారులతో నిర్వహించిన యోగా అభ్యసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వ రోగ నివారిణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మందికి జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువచేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డుకు యోగా స్ట్రీట్గా నామకరణం చేసి ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31న అన్నదాతలతో యోగాసనాల అభ్యసన కార్యక్రమం ఉంటుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ప్రిన్సిపల్ నరసమ్మ, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ప్రముఖ నాట్యాచార్యులు కళారత్న భాగవతుల వెంకట రామశర్మ, కళాక్షేత్ర నృత్య అకాడమీ హవీష చౌదరి పాల్గొన్నారు.
కలెక్టర్ జి.లక్ష్మీశ