
వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజామున స్వామి వారి ఆలయంలో పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణ జరిగాయి. అనంతరం స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు, ఉభయదాతలు భుజం పట్టారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వేద పాఠశాల పునఃప్రారంభం కానుందని, విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ప్రవేశ దరఖాస్తులను పొందవచ్చని పేర్కొన్నారు. సమాజ వికాసానికి తోడ్పడే వేద విద్య అభ్యున్నతికి, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
హోరాహోరీగా
తైక్వాండో పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నగరంలోని ఆంధ్రా లయోల కాలేజీలో ఆదివారం హోరాహోరీగా జరిగాయి. కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కాలేజీ వ్యాయామ విద్యా అధ్యాపకులు మహ్మద్ ఇబ్రహీం ప్రారంభించారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ సీ్త్ర, పురుషు విభాగాల్లో ఈ పోటీలు అత్యంత రసవత్తరంగా జరిగాయి. వయసు విభాగాల వారీగా జరిగిన ఈ పోటీల్లో 94 మంది విజేతలను జిల్లా జట్టుకు ఎంపిక చేశామని, ఈ జట్లు ఈ నెల 9, 10, 11 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం కార్యదర్శి ఎం.అంకమ్మరావు తెలిపారు.
నేడు చైర్పర్సన్ ఎన్నిక
తిరువూరు: తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం జరగనుంది. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి ఎన్నిక జరుపుతారు. ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో జరగనున్న ఎన్నికలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యాలయ పరిసరాల్లో జన సంచా రం నిషేధించడంతో పాటు అన్ని మార్గాల్లో బారికేడ్లు కట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఏసీపీ ప్రసాదరావు పర్యవేక్షణలో సీఐ గిరిబాబు, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
విజయవాడస్పోర్ట్స్: కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జ్యోతిప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరిగోపాల్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సంఘ ఎన్నికలు సంఘం కార్యదర్శి సైకం రామ్ప్రసాద్ పర్యవేక్షణలో జరిగాయి. టెన్నిస్బాల్ క్రికెట్ సంఘం రాష్ట్ర ప్రతినిధి ఆర్.డి.ప్రసాద్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బి.మెహర్బాబు, ఉపాధ్యక్షులుగా జి.జగదీశ్వరరావు, ఎస్.కె.నబి, ఆర్.అప్పలస్వామి, సీనియర్ సహాయ కార్యదర్శులుగా ఎస్.కృష్ణప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా ఎ.శివగణేష్బాబు, జి.సాంబశివరావు, కార్యవర్గ సభ్యులుగా సి.హెచ్.కోటేశ్వరరావు, వి.రాజు, ఆర్.శివయ్య, పి.చంద్రమణిని సభ్యులు ఎన్నుకున్నారు.

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం