
ఏటీవీఎంల వినియోగంలో విజయవాడ ముందంజ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిజిటల్ టికెటింగ్ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఏటీవీఎంల వినియోగంలో విజయవాడ డివిజన్ ముందంజలో ఉందని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. గత 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏటీవీఎంల (ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్) ద్వారా రూ.78 లక్షలు ఆదాయం సాధించినట్లు తెలిపారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా 29 ప్రధాన రైల్వేస్టేషన్లలో 72 ఏటీవీఎం మిషన్లు అందుబాటులో ఉంచినట్లు, ఈ మిషన్ల వినియోగంలో ప్రయాణికులకు సహాయం చేసేందుకు 92 మంది ఫెసిలిటేటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల 41 లక్షల 51 వేల 165 అన్రిజర్వ్డ్ టికెట్ల విక్రయాలలో 33 శాతం ఏటీవీఎం మిషన్ల ద్వారా రూ.78 లక్షల 19వేల 581 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఏటీవీఎంల వినియోగాన్ని విజయవంతం చేయడం పట్ల ప్రయాణికులు, సిబ్బందిని డీఆర్ఎం అభినందించారు. ఏటీవీఎంల వినియోగంతో ప్రయాణికులు రద్దీ సమయంలో అన్రిజర్వ్డ్, ప్లాట్ఫాం, సీజన్ టికెట్ల కోసం ఎక్కువసేపు క్యూలైన్లో వేచి ఉండే అవసరం ఉండదన్నారు. రానున్న రోజుల్లో డివిజన్ వ్యాప్తంగా అన్ని స్టేషన్లలోను ఏటీవీఎం మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.