
జీవితంలో యోగా భాగం కావాలి
ఏపీ జెన్కో ఎండీ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం: యోగా మన భారతదేశ పౌరుల వారసత్వ సంపదని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతిఒక్కరూ రోజువారీ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఆయుష్, పర్యాటక, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యోగా ఔత్సాహికులు యోగాసనాలను అభ్యసించారు. ఈ సందర్భంగా చక్రధర్బాబు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు సూర్య నమస్కారాలు చేసినట్లు ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
డ్రగ్స్ రహిత రాష్ట్రం, జిల్లా లక్ష్యంగా ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ, ఈగల్ ఎస్పీ ఎన్.నగేష్బాబు, ఇతర అధికారులతో కలిసి డ్రగ్స్ వద్దు (1972 టోల్ ఫ్రీ నంబర్) నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీటీపీఎస్ సీఈ పి.శివరామాంజనే యులు, యోగాంధ్ర నోడల్ అధికారులు ఎం.సుహాసిని, శిల్ప, వి.రాణి తదితరులు పాల్గొన్నారు.