
బావిలో పడిన ట్రాక్టర్ : యువకుడి దుర్మరణం
ఏడాది క్రితమే ఆ కుటుంబ పెద్ద అనారోగ్యంతో మరణించాడు. తల్లిని, చెల్లిని పోషించడానికి ఇరవై ఏళ్ల కుమారుడు కుటుంబ బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు. ఆ కుటుంబానికి ఉన్న ట్రాక్టర్ను జీవనాధారం చేసుకుని ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. నేలబావి రూపంలో ఆ యువకుడిని బలి తీసుకుంది.
తిరువూరు: పొలం దుక్కి దున్నడానికి ట్రాక్టరు నడుపుతున్న యువకుడు పొదలమాటున ఉన్న బావిని గమనించకపోవడంతో అందులో పడి దుర్మరణం చెందిన ఘటన ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన చల్లా హరీష్(20) తండ్రి వెంకటేశ్వరరావు ఏడాది క్రితం మరణించగా కుటుంబ పోషణ కోసం ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామ శివారులోని ఒక పొలం దుక్కి దున్నడానికి ట్రాక్టరు తీసుకెళ్లిన హరీష్ పొలంలో పొదల్లో పాడుబడిన బావిని గమనించకుండా ముందుకు నడపడంతో ట్రాక్టరు బావిలో బోల్తా పడింది. చుట్టుపక్కల రైతులు గమనించి అతనిని బావి నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతిచెందాడు. ఏడాది వ్యవధిలోనే భర్త, కుమారుడు ఇద్దరూ మృతిచెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. తమను ఆదుకునేదెవరంటూ రోదిస్తున్న ఆమెను ఆపతరం ఎవరికీ కావడం లేదు. ఎ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.