
హద్దులు దాటిన భూ కబ్జా పర్వం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికార పార్టీ నాయకుల భూ దాహం హద్దులు దాటింది. అధికారంలో తాముంటే ఎక్కడైనా దౌర్జన్యం చేయొచ్చన్న చందంగా తయారైంది కూటమి ఎమ్మెల్యేల తీరు. లేని భూమిని ఉన్నట్లు చూపి నిజాయతీగా కొనుగోలు చేసిన రైతుల భూమిపై కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరిల భూ కబ్జా భాగోతం ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండల పరిధి రంగాపురం గ్రామంలో వెలుగు చూసింది.
రంగాపురం భూ వివాదం ఇలా..
రంగాపురం గ్రామం జమీందారు అడుసుమిల్లి విశ్వేశ్వరరావుకు చెందిన సర్వే నంబర్ 192లో గల 100ఎకరాలను గౌతు యశోధరాదేవి 1956లో కొనుగోలు చేశారు. ఈ భూమిలో 1963 నుంచి 1971వరకు 92.10ఎకరాలను రంగాపురం గ్రామానికి చెందిన 21మంది రైతులకు విక్రయించారు. ఆ తర్వాత 15ఏళ్ల తర్వాత తమకు ఇంకా మిగులు భూమి ఉందని యశోధరాదేవి కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అనుభవంలో ఉన్న రైతులను సంప్రదించకుండా 1986లో సబ్ డివిజన్ చేయించారు. అప్పుడు 100ఎకరాలకు గానూ 98.84ఎకరాలు ఉన్నట్లు తేలింది. దీనిలో అప్పటికే 92.10ఎకరాలను విక్రయించగా 6.74ఎకరాలు రహదారులు, వాగులుకు పోనూ అక్కడ ఏ విధమైన భూమి లేదు. అయినప్పటికీ తమ భూమి 7.40ఎకరాలు ఇంకా తమకు ఉందని గతంలో కొనుగోలు చేసి అనుభవంలో ఉన్న పది మంది రైతులు తమ భూమిని ఆక్రమించారని 1988లో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత ఈ భూమిని కొనుగోలు చేసిన 21మంది రైతులలో ఒకరైన పడమటి కోటేశ్వరరావు కుమారులు నాగేశ్వరరావు, సత్యనారాయణ, రామకృష్ణారావుల నుంచి 1974లో రంగాపురం గ్రామానికే చెందిన గండ్ర భద్రారెడ్డి 3ఎకరాలు, మద్దిరెడ్డి నాగేశ్వరెడ్డి ఎకరం కొనుగోలు చేశారు. అదేవిధంగా 21మంది రైతులలో ఒకరైన కుప్పిరెడ్డి వెంకటరెడ్డి నుంచి కుప్పిరెడ్డి కాంతారెడ్డి ఒక ఎకరం కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ భూమి ఇంకా తమకి ఉందంటూ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూతురు ప్రస్తుత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరి 2017లో రంగంలోకి దిగారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉండగా పొజిషన్లో ఉన్న గండ్ర భద్రారెడ్డి, మద్దిరెడ్డి నాగేశ్వరెడ్డి, కుప్పిరెడ్డి కాంతారెడ్డి కుమారుడు వెంకటరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు ఏడుగురిపై తొమ్మిది అక్రమ కేసులు పెట్టి బెదిరించారు. కేసులు సరికాదని నిర్ధారిస్తూ మైలవరం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు వారి ఆటలు సాగలేదు.
కూటమికి అధికారం రావడంతో..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీరు మరలా ఈ రైతులను వేధించ సాగారు. ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద స్థలంలో 1974 నుంచి పొజిషన్లో ఉన్న రైతు గండ్ర భద్రారెడ్డికి చెందిన 3ఎకరాలు, కుప్పిరెడ్డి కాంతారెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి చెందిన ఒక ఎకరంలో గల వంద మామిడి చెట్లను నరికి ధ్వంసం చేసి కలపను తరలించారు. అదే విధంగా మద్దిరెడ్డి నాగేశ్వరెడ్డి కుమారులు నర్సింహారెడ్డి, అంజిరెడ్డికి చెందిన ఒక ఎకరంలో మామిడి చెట్లను నరికేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. దీనితో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
రంగాపురం రైతుల భూములపై పలాస ఎమ్మెల్యే శిరీష కన్ను లేని భూమిని ఉన్నట్లు చూపి కబ్జాకు యత్నం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ రైతులపై అక్రమ కేసులు స్థానిక ఎమ్మెల్యే సపోర్టుతో టీడీపీ నాయకులను ఉసిగొల్పుతున్న వైనం నాలుగు ఎకరాల మామిడితోట ధ్వంసం
లేనిది ఉన్నట్లు చూపి..
గౌతు యశోధరాదేవి విక్రయించగా 6.74ఎకరాలు వాగులు, రోడ్ల కింద పోయినప్పటికీ తమ భూమి ఇంకా 7.40ఎకరాలు ఉందని 1988లో యశోధరాదేవి కుమారుడు శ్యామ్సుందర్ శివాజీ కోర్టులో కేసు వేశారు. లేని భూమి 7.40ఎకరాలకు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ నుంచి ఆయన అల్లుడు వెంకన్న చౌదరి వివాదం కోర్టులో ఉండగానే 2009లో ఆయన పలుకుబడి ఉపయోగించి జనరల్ పవర్ పొందారు. ఈ భూమిని 2010లో మరో వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తోంది. లేని భూమిని విక్రయించిన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతూ రైతులను వేధిస్తున్నారు. ఈ విధంగా కోర్టులను సైతం తప్పుదోవ పట్టించారు. ఇదిలా ఉండగా ఈ భూమిని 2022లో ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫొటోలో ఉన్న భార్యా భర్తల పేర్లు గండ్ర భద్రారెడ్డి, రామతులశమ్మ. వీరిది రెడ్డిగూడెం మండల పరిధి రంగాపురం గ్రామం. వీరి కుమారుడు సోమిరెడ్డి మృతి చెందగా.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా వివాహాలు చేసుకొని వెళ్లిపోయారు. వీరు 1974లో కొనుగోలు చేసిన 3ఎకరాల భూమిపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరి కన్ను పడింది. వారు వృద్ధులు కావడంతో పొరాటం కూడా చేయలేరని భావించి వీరి భూమిని తమ భూమి అంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. భూమిని కొనుక్కొని నలభై ఏళ్లుగా సాగులో ఉన్న తమపై దౌర్జన్యం చేసి భూమిని లాక్కోవాలని చూడడం దుర్మార్గమని ఈ ఇద్దరు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హద్దులు దాటిన భూ కబ్జా పర్వం

హద్దులు దాటిన భూ కబ్జా పర్వం