చిలకలపూడి(మచిలీపట్నం): సహకార సంస్థల ద్వారా మెరుగైన సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. తన చాంబర్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ 2025ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయనే అంశంపై ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సహకార అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రతి నెలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నివేదిక అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి వి.వి.ఫణికుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.