
ఆటకు దూరమైన చిన్నారి లోకం
నిజామాబాద్నాగారం: ఆటా..పాటా లేక చిన్నారి లోకం ఉసూరుమంటోంది. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బందీలవుతున్నారు. పాఠశాలల్లో సరైన క్రీడా మైదానాలు, వసతులు లేక చదువులకే అంకితమవుతున్నారు. ఫలితంగా పిల్లల జీవనశైలి మారుతోంది. ఆటలు దూరంగా ఉండడంతో మానసిక, శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రైవేటులో అంతంత మాత్రమే..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1171 ఉండగా, ప్రైవేట్ పాఠశాలలో 475 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 80 శాతానికి పైగా క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో పీఈటీలు ఉన్నారు. అయితే క్రీడా సామగ్రి లేకపోవడంతో అంతంత మాత్రంగానే ఆటలు ఆడిస్తున్నారు. ఇక 90 శాతం ప్రైవేట్ పాఠశాలలు క్రీడా మైదానాలు లేకుండానే కొనసాగుతున్నాయి. ఫలితంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటలు కరువయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలో పేరుకు మాత్రమే పీఈటీలను తీసుకొని నవంబర్ , డిసెంబర్లల్లో తొలగిస్తున్నారు.
బోర్డులే మిగిలాయి..
గత ప్రభుత్వం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలల్లో క్రీడా ప్రాంగణాలను డీఆర్డీఏ, పంచాయితీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. జిల్లా యువజన క్రీడల కార్యాలయానికి కేటాయించలేదు. ప్రాంగణాల్లో బోర్డులు మాత్రమే మిగిలాయి. క్రీడా పరికరాలు లేవు. జిల్లాలోని కమ్మర్పల్లి, వేల్పూర్, బోధన్, జక్రాన్పల్లి, నాగారం, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో మినీ స్టేడియాలు ఉన్నా పరికరాలు, కోచ్లు లేరు.
సమయం కరువు..
నిత్యం ఉదయం, సాయంత్రం ఆటలు ఆడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన పిల్లలు మాత్రం ఎంతో కొంత ఆటలు ఆడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఆటలు ఆడే పరిస్థితి పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తుంది. యాజమాన్యాలు చిన్నప్పటి నుంచే ర్యాంకుల పేరుతో పిల్లలపై చదవాలని ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రులకు సైతం క్రీడల కన్నా చదువుపైనే ఫోకస్ పెట్టాలని పట్టుబడుతున్నారు. దీంతో చాలా మంది పిల్లలు ఆన్లైన్లో చదువుకుంటున్నామని చెప్పి వీడియో గేమ్స్, బొమ్మలు, రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లలో ఆటలు..
మూడేళ్లు వచ్చే పిల్లల నుంచి పాఠశాల, కళాశాల స్థాయి చదివే విద్యార్థుల వరకు స్మార్ట్ ఫోన్లకు బందీలవుతున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా ఫోన్లకు అతుక్కపోతున్నారు. ఫోన్ ఇస్తేనే అన్నం తింటామని మారాం చేస్తున్నా రు. సెలవుల సమయంలో గంటల తరబడిగా ఫోన్ లు లేదంటే టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులు
పీఈటీలు ఉన్నా సామగ్రి కరువు
ప్రైవేట్ పాఠశాలలో క్రీడా
మైదానాల కొరత
పల్లె, పట్టణాల్లో పేరుకే
క్రీడా ప్రాంగణాలు
ఫలితంగా సెల్ఫోన్లకు
బందీలుగా పిల్లలు
పిల్లలను కచ్చితంగా ఆడించాలి
చిన్నప్పటి నుంచే పిల్లలకు నచ్చిన ఆటలో మెళకువలు నేర్పించాలి. పాఠశాలలో క్రీడలు ఆడితేనే భవిష్యత్తులో మంచి క్రీడాకారునిగా తయారవుతారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది. వ్యసనాలకు దూరంగా ఉంటారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడలూ అంతే ముఖ్యం. కచ్చితంగా ఆడించాలి.
– ముత్తెన్న, జిల్లా యువజన క్రీడల అధికారి

ఆటకు దూరమైన చిన్నారి లోకం