
వలసదారులూ వెళ్లిపోండి...!
● దేశం విడిచి వెళ్లాలని మలేషియా ప్రభుత్వం ఆంక్షలు ● నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న వారికి క్షమాభిక్ష పథకం అమలు ● ఉమ్మడి జిల్లాలోని వలస కార్మికుల్లో ఆందోళన
నిర్మల్ఖిల్లా: బతుకుదెరువుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వందలాది మంది కార్మికులు విజిట్ వీసాపై మలేషియా వెళ్లారు. కానీ అక్కడి ప్రభుత్వం వలస కార్మికులను తిరిగి వెళ్లి పోవాలని ఆంక్షలు విధించడంతో ఆందోళన చెందుతున్నారు. వీసా నిబంధనలకు విరుద్ధంగా విజిట్ వీసాపై వచ్చి అక్రమ వలసదారులుగా ఉంటున్న వారిని తక్షణమే స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ అక్కడి ప్రభుత్వం తాజాగా ‘క్షమాభిక్ష’ (ఆమ్నెస్టీ) పథకం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం మలేషియా దేశంలో పాస్పోర్ట్ లేకుండా ఉన్నవారితో పాటు తాత్కాలిక వర్క్ వీసాలు, విజిట్ పర్మిట్ వంటివి గడువు ముగిసినా అక్కడే తలదాచుకుంటున్న వలస కార్మికులు వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. క్షమాభిక్ష పథకం ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేవారు ఎటువంటి జైలు శిక్ష లేకుండానే 500 రింగిట్లు, మనదేశ కరెన్సీలో రూ.10వేలు జరిమానా చెల్లించి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. పాస్పోర్టు ఉన్నప్పటికీ, వీసా గడువు ముగిసిన వారితో పాటు, వీసాలు లేని వారందరినీ ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ ఆధారంగా పక్షం రోజుల్లో రిటర్న్ జర్నీకి అవకాశం కల్పించింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న వలసదారులందరూ మలేషియాలోని లాబువాన్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంటు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.
ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 500 మంది..
నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి కోసం మలేషియా వెళ్లిన వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 500 మంది వరకు ఉండవచ్చని ఎన్ఆర్ఐ రాష్ట్ర కమిటీ అడ్వైజరీ మెంబర్ స్వదేశ్ పరికిపండ్ల పేర్కొంటున్నారు. ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వెళ్లిన వారంతా తాజా నిబంధనలతో స్వస్థలాలకు తిరిగి రావాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది మలేషియాలో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలైన దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలతో పాటు మలేషియా కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో మలేషియాలో ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2,500 మంది వరకు ఉండగా తాజా నిబంధనలతో అందులో 500 మంది స్వదేశాలకు తిరిగి రావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి గడువు 2026, ఏప్రిల్ 30 వరకు నిర్దేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.