13 అసెంబ్లీ స్థానాలకుగానూ 8 టీవీకే పరం
ఫలితాలపై ఉమ్మడి చిత్తూరులో జోరుగా చర్చ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు అసెంబ్లీ స్థానాల్లోనూ విజయ్ పార్టీ సత్తా చాటింది. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు, కుప్పం సమీపంలో.. తమిళనాడు అసెంబ్లీ నియోజక వర్గాలు గుమ్మడిపూడి, తిరుత్తణి, అరక్కోణం, సోలింగరం, కంచి, కాటా్పడి, వేలూరు, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు, బొడుగూరు, వేపనపల్లి ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో గుమ్మడిపూడి, అరక్కోణం, కంచి, కాట్పాడి, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు అసెంబ్లీ స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఈ నియోజక వర్గాల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.
ఫలితాలపై జిల్లా వాసుల ఆసక్తి
⇒ తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఆసక్తి చూపించారు. సరిహద్దు గ్రామాల ప్రజలతో పాటు చిత్తూరు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, నగరి, సూళ్లూరుపేట, తిరుపతి వాసులు ఉదయం నుంచి టీవీలు, మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆరాట పడ్డారు.
విజయ్ పార్టీ విజయంపై స్వీట్లు పంచిపెట్టడం కనిపించింది. వ్యాపారులు, కొందరు రాజకీయ నాయకులు తమిళనాడు ఎన్నికలపై బెట్టింగ్లు కాయడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు విజయ్ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు.


