ఆహారం విషయంలో ఇండిగో ఫ్లైట్‌లో గొడవ.. వీడియో వైరల్‌

Video Of Argument Between Passenger And Crew Of IndiGo Airline Viral - Sakshi

విమానంలో అందించే ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో గొడవ పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇస్తాంబుల్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. అందులోని గుర్‌ప్రీత్‌ సింగ్‌ హాన్స్ అనే మరో ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి డిసెంబర్‌ 19న ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు ఇండిగో విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

‘దూర ప్రాంతాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో అనువైన ఆహారం అందించాలి. కానీ అలా జరగటం లేదు. ఇచ్చిన ఆహారం తిని కొందరు సర్దుకోగలరు కానీ అందరు అలా ఉండలేరు. ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూశాను. ’ అని రాసుకొచ్చారు గుర్‌ప్రీత్‌ సింగ్‌ హాన్స్‌. 

వీడియో ప్రకారం.. ఎయిర్‌హోస్టెస్‌తో ఓ ప్రయాణికుడు వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘నీ వల్ల విమానంలో గందరగోళం నెలకొంది. నీ బోర్డింగ్‌లో ఉన్న ఆహారమే అందిస్తున్నాం. ప్లీజ్‌ అర్థం చేసుకోండి.’ అని ఎయిర్‌హోస్టెస్‌ సూచించారు. ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది. మరో సిబ్బంది కలుగ జేసుకుని సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ క్రమంలో ఆమె సర్వెంట్‌, ఒక ఉద్యోగిని, నేను మీ సర్వెంట్‌ని కాదు అని పేర్కొన్నారు ఆ ప్రయాణికుడు. ఎయిర్‌హోస్టెస్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లగా వివాదం సద్దుమణిగింది.  అయితే, ఈ సంఘటనపై ఎయిర్‌లైన్స్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇదీ చదవండి: ఇదేందయ్యా రాహుల్‌.. కాంగ్రెస్‌ కార్యకర్తకు చేదు అనుభవం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top