Bihar: నితీష్‌ కుమార్‌కు షాకిచ్చిన పాట్నా హైకోర్టు.. | Setback For Nitish Kumar Govt as Patna HC stays Bihar caste Survey | Sakshi
Sakshi News home page

Caste Based survey: నితీష్‌ కుమార్‌కు షాకిచ్చిన పాట్నా హైకోర్టు..

May 4 2023 9:29 PM | Updated on May 4 2023 9:30 PM

Setback For Nitish Kumar Govt as Patna HC stays Bihar caste Survey - Sakshi

పాట్నా: నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వానికి  పాట్నా హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేపై హైకోర్టు స్టే విధించింది. కుల గణనపై దాఖలైన మూడు పిటిషన్‌లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ మధురేష్‌ ప్రసాద్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కుల, ఆర్థిక సర్వేలు నిర్వహిస్తోందని పిటిషనర్లలో ఒకరైన దిను కుమార్ కోర్టుకు తెలిపారు. సర్వేలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించినదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతం జరుగుతున్న సర్వేపై తక్షణమే స్టే విధించాలని, ఇప్పటివరకు సేకరించిన సర్వే డేటాను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.

కాగా మహాఘట్‌బంధన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రూ. 500 కోట్లు ఖర్చుపెడుతోంది. రెండు దశల్లో చేపట్టిన ఈ గణన జనవరి 7న ప్రారంభమైంది. మొదటి దశలో  7వ తేదీ నుంచి 21వ తేదీ వ‌ర‌కు కులాల లెక్కింపు జరిగింది. రెండో స‌ర్వే ఏప్రిల్ 15న ప్రారంభమవ్వగా మే 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉంది.
చదవండి: రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్‌ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో..

ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కులం, విద్య, ఆర్థిక, సామాజిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు.  వాస్తవానికి  కులగణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రం కుల గణన చేపట్టాలని నితీష్‌ కుమార్‌ పలుమార్లు కోరారు. కానీ కేంద్రం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో బిహార్‌ సీఎం స్వయంగా తమ రాష్ట్రంలో కుల గణన చేపట్టింది. అవ‌స‌ర‌మైన వారికి సేవ‌లు అందించ‌డంలో స‌ర్వే ఉపయోగ‌ప‌డుతుంద‌ని సీఎం నితీశ్ తెలిపారు.

అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై వస్తున్న వ్యతిరేకతపై నితీష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వెనకబడిన వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రజలకే ప్రభుత్వం లక్ష్య సాయాన్ని సులువగా చేర్చేందుకు దోహదపడుతందన్నారు. 
చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement