లిక్కర్‌ స్కాం: కేజ్రీవాల్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌ | Rouse Avenue Court Reserve Arvind Kejriwal Bail Plea Petetion | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం: కేజ్రీవాల్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

Jun 20 2024 12:51 PM | Updated on Jun 20 2024 12:51 PM

Rouse Avenue Court Reserve Arvind Kejriwal Bail Plea Petetion

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రౌస్‌ అవెన్యూ కోర్టు రిజర్వ్‌ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌ కోరుతూ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా, కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు(గురువారం) రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌ పాత్ర ఉందని స్పష్టం చేసింది. అలాగే, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకరించడంలేదని తెలిపింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వొదని కోర్టును కోరింది.

 

 

బుధవారం జరిగింది ఇది.. 
ఇదిలా ఉండగా.. లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌ లంచంగా రూ.100 కోట్లను డిమాండ్‌ చేశారని ఈడీ ఆరోపించించి. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని ముద్దాయిగా చేర్చడాన్ని సమర్ధించుకుంది. రాజకీయ పార్టీ నేరానికి పాల్పడిందంటే దానికి పార్టీ అధినేతే కారణంగా ఉంటారని పేర్కొంది.

కాగా, కేజ్రీవాల్‌కు ఇదివరకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ గడువు ముగియడంతో బుధవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. జులై 3 వరకు కస్టడీ గడువును పొడిగిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు జడ్జి న్యాయ్‌ బిందు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తరఫున దాఖలైన బెయిల్‌ పిటిషన్‌పైనా ఇరుపక్షాల వాదనలను జడ్జి విన్నారు. పార్టీకి అవసరమైన నిధుల కోసం రూ.100 కోట్లు ఇవ్వాల్సిందిగా సౌత్‌గ్రూప్‌ను కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారని ఈడీ ఆరోపించింది. ఈ మొత్తం హవాలా మార్గంలో గోవాకు చేరిందని తెలిపింది.

మరోవైపు.. ఈడీ వాదనలను కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. కేజ్రీవాల్‌ కేసు మొత్తం వాంగ్మూలాలపైనే ఆధారపడి ఉందని, అంతకుమించి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఆ వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులందరూ ఇదే కేసులో నిందితులుగా, అప్రూవర్లుగా ఉన్నారని గుర్తు చేశారు. మరి కొందరైతే అరెస్టు చేయబోమనే హామీని దర్యాప్తు సంస్థ నుంచి పొందారని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ కస్టడీని పొడిగించడం తగదని వాదించారు. దీంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. 

Advertisement
 
Advertisement
Advertisement