కుంకుమపువ్వు ఈ పేరు చెబితేనే ప్రధానంగా గుర్తుకు వచ్చేది జమ్మూకశ్మీర్.. ఎందుకంటే ఆ పంటలకు కావాల్సిన వాతావరణ పరిస్థితులు అక్కడే అధికంగా ఉంటాయి గనుక ప్రధానంగా ఆ ప్రాంతమే గుర్తుకు వస్తుంది. అయితే పంజాబ్లోని యువరైతులు ఆ రికార్డును బ్రేక్ చేశారు. అత్యాధునికి పద్దతులను అనుసరించి కుంకుమపువ్వు సాగు చేస్తున్నారు. అంతే కాదండోయ్.. ఒక కిలో రూ.13 లక్షలకు రికార్డు స్థాయిలో విక్రయించి రికార్డు సృష్టిస్తున్నారు.
కుంకుమ పువ్వు పంటను పండించాలంటే అంతా ఆషామాషీ కాదు..దానికి ప్రత్యేక మైన వాతావరణ పరిస్థితులతో పాటు అణువైన నేలకావాలి. ఈ పరిస్థితులు మన దేశంలో ఎక్కువగా జమ్మూకశ్మీర్ ప్రాంతంలోనే ఉంటాయి. అంతే కాకుండా దీనిని సాగుచేయడం చాలా కష్టం కావడంతో ధరలు కూడా అంతే స్థాయిలో అధికంగా ఉంటాయి. అయితే పంజాబ్కు చెందిన సోదరి, సోదరుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యంత నాణ్యమైన కుంకుమపువ్వును పండించి రికార్డు స్థాయి ధరకు అమ్మారు.
వ్యవసాయంపై మక్కువతో
లూధియానాలో నివసించే ఆస్తిక నారులా, ఆమె సోదరుడు శంకర్ నారులా ఉన్నత విద్యావంతులు. వీరికి ఎటువంటి వ్యవసాయ నేపథ్యం లేదు అయితే వ్యవసాయం మీద మక్కువతో 2019 కాలంలో ఆధునాతన వ్యవసాయ పద్దతులపై అధ్యయనం చేశారు. దీంతో కుంకుమపువ్వును ఇంటివద్దే సాగుచేయాలని నిశ్చయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా 630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏరోపోనిక్స్ సాంకేతికతను ఉపయోగించి వాతావరణాన్ని నియంత్రించే గది ఏర్పాటు చేశారు. కశ్మీర్లో ఉండే వాతావరణం మాదిరిగా ఉండడానికి LED గ్రో లైట్లు, హ్యూమిడిఫైయర్లను ఉపయోగించారు. ఉష్ణోగ్రత 3నుంచు 27 శాతం మధ్య ఉండేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కుంకుమ పువ్వు పంటకు అనుగుణమైన తేమ, కార్బన్ డయాక్సైడ్ను రూపొందించారు.
అనంతరం కశ్మీర్ నుండి కుంకుమపువ్వు విత్తనాలను తీసుకవచ్చారు. అయితే వ్యవసాయం తొలినాళ్లలోనే వారికి ఎదురుదెబ్బ తగిలింది. వేడిమి కారణంగా దాదాపు 20 శాతం వరకూ విత్తనాలు పాడైపోయాయి. దీంతో భారీగా నష్టం చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ బెదరకుండా పంటను ప్రారంభించి అత్యంత నాణ్యమైన కుంకుమపువ్వును పండించారు.
రికార్డు ధరకు
వీరు తొలి ఏడాది 1.3 కిలోల కుంకుమ పువ్వును పండించారు. అయితే దానిని ఒక గ్రాముకు రూ.1300-1650 మధ్య విక్రయిస్తున్నారు. అంటే కేజీకి దాదాపుగా రూ.13 లక్షలు. అయితే సాధారణంగా దీని ధర గ్రాముకు రూ 300-400 మధ్య ఉంటుంది. వీరు పండించే పవ్వు అత్యంత నాణ్యమైనది కావడంతో అంత అధిక ధరకు విక్రయిస్తున్నారు. వీరు ప్రధానంగా ఈ పంటను ఆస్ట్రేలియా,కెనడాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్తు కాలంలో దిగుబడిని మరింత పెంచుతామని యువ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేసే కుంకుమ పువ్వులో సింహభాగం సుమారు 90%కు పైగా ఇరాన్ ఉత్తత్తి చేస్తోంది.


