సామర్థ్యానికి మించి సెంట్రల్ జైళ్లలో 124.8 శాతం రద్దీ
రాష్ట్ర జైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేటు 90.8 శాతం
కారాగారాల్లో తీవ్ర సిబ్బంది కొరత.. 797 పోస్టులు ఖాళీ
ఒక్కరూ లేని కరెక్షనల్ సిబ్బంది
యువ నేరస్థులను మంచి మార్గంలోపెట్టే ‘బోస్టల్ స్కూల్స్’ లేమి
మొత్తం 7,861 మంది ఖైదీల్లో 5,705 మంది విచారణ ఖైదీలే
260 మంది ఖైదీలకు మానసిక రుగ్మతలు
ఎన్సీఆర్బీ ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్–2024’ నివేదిక వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2024’ నివేదిక ఆంధ్రప్రదేశ్ జైళ్ల పరిస్థితిపై పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. రాష్ట్ర జైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేటు సామర్థ్యానికి లోపే ఉన్నప్పటికీ.. కీలకమైన సెంట్రల్ జైళ్లు మాత్రం ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. మంజూరైన పోస్టుల్లో 30 శాతం ఖాళీగానే ఉండటం, ఖైదీల ప్రవర్తనలో మార్పులు తెచ్చే ‘కరెక్షనల్’ సిబ్బంది రాష్ట్రంలో ఒక్కరు కూడా లేకపోవడం, యువ నేరస్థులను మంచి మార్గంలోపెట్టే ’బోస్టల్ స్కూల్స్’ లేమి ఏపీ జైళ్ల శాఖలోని డొల్లతనానికి అద్దం పడుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల్లో ‘ఏపీ’ ముఖ్యాంశాలు...
⇒ ఏపీ జైళ్ల శాఖలో 2,637 పోస్టులు మంజూరు కాగా.. 1,840 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 797 పోస్టులు (దాదాపు 30 శాతం) ఖాళీగా ఉన్నాయి.
⇒ జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకువచ్చే కరెక్షనల్ సిబ్బంది (ప్రొబేషన్ లేదా వెల్ఫేర్ ఆఫీసర్లు, సైకాలజిస్టులు తదితరులు) ఏపీ జైళ్లలో ఒక్కరు కూడా లేకపోవడం తీవ్ర ప్రతికూల అంశం.

⇒ యువ నేరస్థులను సన్మార్గంలో పెట్టే ‘బోస్టల్ స్కూల్స్’, ‘స్పెషల్ జైళ్లు’ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవు.
⇒ రాష్ట్రంలో 260 మంది ఖైదీలు (156 మంది శిక్ష పడినవారు, 103 మంది విచారణ ఖైదీలు, ఒక డిటెన్యూ) మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు.
⇒ జైళ్లలో ఉన్న మొత్తం 7,861 మందిలో అత్యధికులు విచారణ ఖైదీలే (అండర్ట్రయల్స్) కావడం మరో ఆందోళనకర అంశం.
⇒ ఏకంగా 5,705 మంది (72.5 శాతం) కోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు.
⇒ విచారణ నిమిత్తం 2024లో ఖైదీలను 81,205 సార్లు కోర్టులకు తరలించారు. వైద్య సహాయం కోసం 10,191 సార్లు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.
⇒ జైళ్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించి రాష్ట్రాల జాబితాలో (లక్షదీ్వప్ మినహాయించి) ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.


