Sex Abuse Case Against Professor At Chennai Academy After Students Protest - Sakshi
Sakshi News home page

క‌ళాక్షేత్ర ఫౌండేష‌న్‌లో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు!.. సీఎం స్టాలిన్‌ సీరియస్‌!

Apr 1 2023 10:56 AM | Updated on Apr 1 2023 11:25 AM

Case Against Professor At Chennai Academy After Students Protest - Sakshi

చెన్నై: అతను శాస్త్రీయ కళలకు పాఠాలు బోధించే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. కానీ, హద్దులు మీరి.. శిక్షణ పొందుతున్న యువకులతో అనుచితంగా ప్రవర్తించాడు. వారిని బాడీ షేమింగ్‌ లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, దాదాపు 200 మంది విద్యార్ధినిలు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు అతడిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ కూడా స్పందిస్తూ.. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని యవతులకు హామీ ఇచ్చారు. 

వివరాల ప్రకారం.. చెన్నైలోని సాంప్ర‌దాయ క‌ళ‌లను బోధించే ప్ర‌తిష్టాత్మ‌క క‌ళాక్షేత్ర ఫౌండేష‌న్‌లో ప‌నిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ హరి పద్మన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. అయితే, పద్మన్‌.. ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. ఆ ప్రొఫెస‌ర్‌, మరో ముగ్గురు రిపర్టరీ ఆర్టిస్టులు త‌మను లైంగికంగా వేధిస్తున్నార‌ని, బాడీ షేమింగ్, దుర్భాష‌లాడుతున్నారని ఆమెతో పాటు మరో 200 మంది విద్యార్థినిలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు, వారి పేరెంట్స్‌ కూడా నిరసనలు దిగారు. 

అయితే, గతంలో కూడా హరి పద్మన్‌పై లైంగిక వేధింపుల కారణంగా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థినిలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఇందులో నిజం లేదని తప్పుడు ప్రచారం అంటూ కమిషన్‌ వారి ఫిర్యాదును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా దాదాపు 90 మంది విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్‌కి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం, విద్యార్థినిలు.. డైరెక్టర్ రేవతి రామచంద్రన్‌ను తొలగించాలని, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌లకు లేఖ రాశారు. దీంతో, స్పందించిన సీఎం స్టాలిన్‌ నిందితుల‌పై క‌ఠినంగా లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. 

కళాక్షేత్ర ఫౌండేషన్‌ను 1936లో నర్తకి రుక్మిణీ దేవి అరుండేల్ స్థాపించారు. ఇది భరతనాట్యం, కర్ణాటక సంగీతం, ఇతర సాంప్రదాయ కళలలో కోర్సులను అందించే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఇది శ్రేష్ఠత, క్రమశిక్షణ వంటి ఉన్నత ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. దశాబ్దాలుగా అనేక మంది ప్రముఖ కళాకారులు ఇక్కడి నుంచి శిక్షణ పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement