
ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు
జడ్చర్ల టౌన్: పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తప్పదని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని, అది ఎంతో దూరం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జడ్చర్ల ప్రేమ్రంగా గార్డెన్లో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్బోర్డు చట్టంపై ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేశాక కశ్మీర్ను మరో స్విట్జర్లాండ్గా భావించి పర్యాటక రంగం ఊపందుకుందన్నారు. అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దేశ, విదేశాల నుంచి పర్యాటలకు వస్తుంటే చూస్తూ తట్టుకోలేక పాకిస్తానీయులు ఉగ్రవాదులతో దాడులు చేయించిందన్నారు. భారతీయులంతా పార్టీలకు అతీతంగా దేశం కోసం భద్రత, రక్షణ కోసం ఉగ్రదాడులను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల వ్యయ ప్రయాసాలు తగ్గి అభివృద్ధిపై దృష్టిసారించే ఆస్కారం ఉంటుందన్నారు. వక్ఫ్బోర్డు చట్టం వల్ల పేద ముస్లింలకు ఎంతో లాభం కలగనుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మేధావులు ఉమ్మెంతల మహేశ్వర్, జగ్పాల్రెడ్డి పాల్గొన్నారు.