
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్తో కొత్త వంగడాలు
నర్వ: కేంద్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ద్వారా కొత్త వంగడాలను రైతులకు అందిస్తుందని ఐసీఏఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్డి. ప్రసాద్ అన్నారు. గురువారం పాథర్చేడ్లో ఐసీఏఆర్, ఐఐఓఆర్, కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం) ఆధ్వర్యంలో నూనెగింజల పంటల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది రైతులకు 700 జిల్లాల్లో ప్రత్యేక్ష సంభాషణ ద్వారా నూతన సాంకేతికత, ఉత్పాదకాలు, కొత్తవంగడాలపై అవగాహన కల్పిస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, మట్టి పరీక్షల కార్డులను రైతులకు అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా సైంటిస్టులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా దేశంలో నూనెగింజల వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నూనెగింజల ఉత్పత్తిని బాగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆముదం పంట సాగును బాగా విస్తరించేందుకు తీసుకోవాల్సిన అవసరం, పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఎప్పుడు ఒకే పంట కాకుండా పంటల మార్పిడి చేస్తే అధిక దిగుబడులు సాదించవచ్చన్నారు. అనంతరం రైతులకు ఐసీహెచ్–5 అనే ఆముదం విత్తనాలను ఉచితంగా రైతులకు అందించారు. కార్యక్రమంలో సైంటిస్టులు సురేష్, రాజేందర్రెడ్డి, నర్వ ఏఓ అఖిలారెడ్డి, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.