
ఆహారం విషయంలోజాగ్రత్తలు పాటించాలి
ఊట్కూరు: వయసు పైబడివారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. మండలంలోని పగిడిమారిలో గురువారం ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ క్యాంపులో ఉచితంగా బీపీ, షుగర్ తదితర పరీక్షలను నిర్వహించి పలువురికి సూచనలతోపాటు మందులను పంపిణీ చేస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు ఆహార నియమాలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సత్యప్రకాష్, డాక్టర్ సంతోషి, వైధ్య సిబ్బంది విజయ్కుమార్, అశోక్కుమార్, శ్రీదర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
భూ భారతిలో 475 దరఖాస్తులకు మోక్షం
మద్దూరు: భూభారతి పైలెట్ మండలమైన మద్దూరులో మొత్తం 475 దరఖాస్తులకు మోక్షం లభించింది. ఏప్రిల్ 28 వరకు మండలంలోని 30 గ్రామాల్లో భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. భూ సమస్యలపై ఆయా గ్రామల్లో ప్రజల నుంచి మొత్తం 1341 అర్జీలు రాగా.. వాటిని కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓ, ఆరుగురు తహసీల్దార్లు వాటిని పరిశీలించారు. వీటిలో 475 దరఖాస్తుల భూ సమస్యలను పరిష్కరించారు. వివిధ కారణాలతో 753 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. 113 సాదాబైనామాలు కోర్టులో కేసులు ఉండడం, తిరస్కరణకు గురైన వాటిలో 192 వివిధ దశల్లో ఉన్నట్లు సమాచారం.
ఎంపీ మల్లురవిపై అధిష్టానానికి ఫిర్యాదు
అలంపూర్: నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే, అలంపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సంపత్కుమార్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ మల్లు రవి జిల్లాలో పర్యటించారు. ఈక్రమంలో కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత ఇంటికి ఎంపీతోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వెళ్లడంపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే అలంపూర్ క్షేత్రానికి ఆయన విచ్చేయగా.. సొంత పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ను మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఐటీఐలో ప్రవేశాలు
వనపర్తి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో 2025–26, 27 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడత ప్రవేశాలకు ఉపాధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేశామని, సీట్ల భర్తీకి అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రమేష్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు iti.telangana.gov.in వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 21 వరకు అవకాశం ఉందని, ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 79953 35372, 98492 44030లను సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: జిల్లాలోని గిరిజన బాల, బాలికల నుంచి బెస్ట్ అవైలేబుల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి శాఖ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 10 ఖాళీలకు గాను 3, 5, 8 తరగతుల విద్యార్థులు అర్హులని, వనపర్తి జిల్లా, గిరిజన తెగలకు చెందిన (లంబాడీ, ఎరుకల వారు) విద్యార్థులు ధ్రువపత్రాలతో ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత వారి ఆదాయం రూ.2 లక్షలు మించకూడదని, దరఖాస్తు ఫారాలు క లెక్టరేట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

ఆహారం విషయంలోజాగ్రత్తలు పాటించాలి