
అలజడి.. ఆందోళన
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజల్లో కునుకులేకుండా పోయింది. తాజాగా బుధవారం ఫ్యాక్టరీ వద్ద జరిగిన దాడులు, నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో పెద్ద ధన్వాడతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. రైతులు చేసిన దాడికి సంబంధించి కంపెనీకి చెందిన సీఏఓ మంజునాథ్ రాజోళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడుల్లో తమ సిబ్బంది పలువురికి గాయాలు కావడంతో పాటు కంపెనీకి చెందిన వాహనాలు, సామగ్రి ధ్వంసమైనట్లు అందులో పేర్కొన్నారు. దాడులకు దిగిన 41 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేయగా.. ఇందులో జనం సాక్షి పత్రిక ఎడిటర్ రహమాన్తో పాటు నాగర్కర్నూల్ జిల్లా సబ్ జైలర్ నాగరాజు ఉండడం చర్చనీయాంశంగా మారింది. దాడుల సమయంలో వారు ఘటన స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై రాజోళి ఎస్సై జగదీష్ని సంప్రదించగా.. దాడులకు ప్రేరేపించింది రహమాన్, నాగరాజు అని, మంజునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మానవపాడు మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేఎంఎస్ శ్రావణ్పై కేసు నమోదైంది. 191(2), 191(3), 329(3), 329(4), 324(5), 126(1), 326(జీ), 115(2), 118(1), 121(1), 132, 126(2), 109, 61(2), 199బీఎన్ఎస్, 0 సీఎల్ఏఏ–2013 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా.. కేసులు నమోదైన వారిలో 12 మందిని పోలీసులు గద్వాల జిల్లా కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్కు తరలించిన వారిలో పెద్ద ధన్వాడకు చెందిన రైతులు నర్సింహులు, కె.నర్సింహులు, భరత్ కుమార్, చిన్న నాగేంద్ర, నల్లబోతుల కాటన్, శివ గౌడ్, సూర్యప్రకాష్, భీమన్న, మనోహర్, యేసన్న, నాగేంద్రంతోపాటు చిన్న ధన్వాడకు చెందిన పరుషరాముడు ఉన్నారు. జడ్జి తీర్పు అనంతరం పోలీసులు వీరిని ప్రత్యేక వాహనంలో మహబూబ్నగర్లోని జిల్లా జైలుకు తరలించారు.
బిక్కు బిక్కుమంటూ..
బుధవారం ఘటన అనంతరం రాత్రి పోలీసులు అరెస్టులు మొద లు పెట్టడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామంతో పాటు ఇటు చిన్నధన్వాడ గ్రామస్తుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు తీసిన వీడియోల ఆధారంగా అరెస్టులు ఉంటాయని తెలియడంతో, మామూలుగా ఘటనా స్థలి దగ్గరకు వెళ్లిన వారు కూడా ఆందోళన చెందుతున్నా రు. వీరితో పాటు అదే ప్రాంతంలో ఫ్యాక్టరీ పక్కనే తమ పొలాలు ఉన్న వారు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. వారు కూడా తమపై ఏదైనా చర్యలుంటాయనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ సాటి రైతులపై కేసులు నమోదయ్యాయని తెలిసి భయబ్రాంతులకు గురవుతున్న రైతులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై దాడి చేయడం తగదని.. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమంగా కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని.. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుని అడ్డుకోవడం రైతుల ప్రాఽథమిక హక్కు అని.. ఓ మైనర్పై కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. రాజోళి ఎస్సై జగదీశ్వర్తో పాటు గాయత్రి ఇండస్ట్రీస్ అండ్ రెన్యువేబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా పోలీస్ హింసలో గాయపడిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన కమిషన్ 13030/ ఐఎన్/2025 నంబర్తో కేసు నమోదు చేసింది.
● కాగా.. ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తులు దాడిలో తాము గాయపడ్డామని పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ, కుర్వ క్రిష్ణ, కుర్వ లింగన్న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
నిర్మానుష్యంగా మారిన పెద్ద ధన్వాడ గ్రామం
వ్యవసాయం.. పాడి పశుపోషణ.. కూలీ పనులు.. ఇవే వారి ప్రధాన జీవనోపాధి.రెక్కల కష్టాన్ని నమ్ముకొని.. వచ్చిన కొంత డబ్బుతో కాలం గడిపేవారు ఆ గ్రామస్తుల జీవితం ఒక్కరోజులోనే తలకిందులైంది. పోలీస్స్టేషన్లు.. కేసులు.. జైలు.. ఇలా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చు దాదాపు 12 గ్రామాల్లో అలజడి.. వందల కుటుంబాల్లో భయాందోళన సృష్టిస్తోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/రాజోళి
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త ఘటనలతో గ్రామాల్లో అలజడి
అరెస్టులతో 12 గ్రామాల్లో ఆందోళన
41 మందిపై కేసు.. 12 మంది రిమాండ్
ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు