
మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: రాష్ట్రంలో మే 7 నుంచి మే 30 వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మీ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పీఓ డబ్ల్యూ, ఐద్వా, పీవైఎల్, డివైఎఫ్ఐ, పీడీఎస్యూ, సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మున్సిపల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి పార్కు ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షత వహించగా విజయలక్ష్మీ, రాజేశ్వరి మాట్లాడారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైద్రాబాద్లో జరగనున్నాయని, అందాల పోటీలు సామ్రా జ్యవాద దేశాల బహుళజాతి కంపెనీల సరుకుల అమ్మకం కోసం జరుగుతున్న పోటీమాత్రమేనని అన్నారు. పోటీలను రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ , ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నరహరి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సౌజన్య, జిల్లా ఉపాద్యాక్షురాలు లక్ష్మీ, ఐద్వా జిల్లా కార్యదర్శి, సమ్రిన్ బేగం, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.