
‘భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాం’
గద్వాల: దేశంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో అభివృద్ధే అభిమతంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం గద్వాలలోని డీకే బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 11 ఏళ్ల పాలనలో మోదీ సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాఖ్ రద్దు, వక్ఫ్ సరవణ చట్టం, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేలా కృషి చేస్తున్నారన్నారు. పెహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఉగ్ర శిబిరాలు, పాక్పై నరేంద్రమోదీ చేపట్టిన చర్యలకు ప్రపంచ దేశాలు మెచ్చుకుంటుంటే మన దగ్గర మాత్రం కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మోదీ 11 ఏళ్ల పాలనపై కేంద్రకమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో విస్తృత ప్రచారం, ఈ నెల 6న అన్ని మండలాల్లో ఒకేస్థాయి కార్యశాలలు, 9, 10, 11 తేదీల్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రపోషన్ మీట్స్, మేధావుల సదస్సులు, ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప్ సభలు నిర్వహించాలన్నారు. రచ్చబండ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, ఈ ప్రోగ్రామ్స్, డిజిటల్ కాంపిటీషన్స్ వంటివి నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, వెంకట్రాములు, రమాదేవి, రవికుమార్, జయశ్రీ, దేవదాసు, వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణవేణి పాల్గొన్నారు.