
నిర్వాసితులకు న్యాయమైన పరిహారం
ఊట్కూరు: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో పాటు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరి, కంది విత్తనాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా 9 నెలలకు ఒకసారి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇవ్వకుండా ప్రతి 2 నెలలకోమారు అందిస్తున్నామని తెలిపారు. 18 నెలల్లో మండలానికి రూ.90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామని తెలిపారు. ఎత్తిపోతల పథకంలో కోల్పోతున్న భూములకు మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం అందించాలని, ఇంటికో ఉద్యోగాన్ని ఇవ్వాలని దంతన్పల్లి శివారు రైతులు ఎమ్మెల్యేను కోరారు. ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో ఎంత నష్టపరిహారం అందిస్తే అదే లెక్కన ఇక్కడి రైతులకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, ఏఓ గణేష్రెడ్డి, నాయకులు ఎల్కోటి నారాయణరెడ్డి, లింగం, యజ్ఞేశ్వర్రెడ్డి, మహేష్రెడ్డి, గోపాల్రెడ్డి, దత్తు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
నర్వ: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మండలంలో ఇప్పటి వరకు 452 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నేరవేరుస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు చెన్నయ్యసాగర్, కృష్ణారెడ్డి, వివేక్ వర్ధన్, అయ్యపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.