
●
● చర్చనీయాంశంగా మారిన ‘సాక్షి’ కథనం
● సమాధులపై వేసిన రోడ్డు మీదకు స్వయంగా తరలివచ్చిన
బాధిత కుటుంబీకులు
● అప్పుడు అడ్డుకున్నా.. స్పందించలేదని ఆవేదన
● ఇప్పుడు రాజకీయాలంటూతప్పించుకుంటున్నారని ధ్వజం
సమాచారం ఇవ్వలేదు..
తాళ్ల చెరువు కట్టమీద మా తాత ముత్తాతల నుంచి ఉన్న సమాధులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే తొలగించారు. అనంతరం వాటిపై సీసీ రోడ్డు వేశారు. సమాధులు తొలగించి తాత ముత్తాలకు సంవత్సరికం పెట్టుకోకుండా చేశారు.
– జీటీ శ్యాం, గాంధీనగర్, వనపర్తి
చాలా బాధాకరం
గత డిసెంబర్లో మా బావ చనిపోతే తాళ్ల చెరువు వద్ద పూడ్చి పెట్టాం. కానీ అభివృద్ధి పేరుతో తాళ్ల చెరువు వద్ద ఉన్న సమాధులన్నీ తొలగించి, వాటిపై సీసీ రోడ్డు వేశారు. చనిపోయిన వారి జ్ఞాపకాలు లేకుండా చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఎక్కడో ఒకచోట పెట్టుకునే వాళ్లం. చనిపోయిన వాళ్లను చూసుకోకుండా చేయడం చాలా బాధాకరం.
– రాజు, హరిజనవాడ, వనపర్తి
స్థలం చూపలే..
ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు స్థలం లేదు. ఇదే విషయమై ఎన్నోసార్లు అధికారులను కలవడం జరిగింది. ఏనాడు వారు వచ్చి మాకు స్థలం చూపించిన పాపాన పోలేదు. ఇప్పుడేమో తాత ముత్తాతల నుంచి ఉన్న సమాధులను జేసీబీతో తొలగించారు. సమాధులపైనే సీసీ రోడ్డు వేశారు. ఏడాదికోసారి పెద్దలకు పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టాలో తెలియక రోడ్డుపైనే పూలు చల్లి వస్తున్నాం.
– బుచ్చన్న, కర్రెమ్మ గుడి, వనపర్తి
వనపర్తి/ వనపర్తి టౌన్/ వనపర్తి క్రైం: కాలం చేసిన కుటుంబీకుల జ్ఞాపకార్థం నిర్మించిన సమాధులపై రోడ్డు వేసి.. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వైనంపై ‘సాక్షి’లో ఈ నెల 25న ‘సమాధులపై రస్తా’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. తాళ్ల చెరువు ఆధునికీకరణ పేరిట చోటుచేసుకున్న ఈ ఘటన వెలుగులోకి రాగా.. హాట్టాపిక్గా మారింది. రంజాన్ సందర్భంగా ఈ కట్టపైనే శనివారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏ నలుగురు కలిసినా సమాధులపై రోడ్డు వేయడం ఏమిటనే చర్చ జోరుగా సాగింది. అదేవిధంగా ఆదివారం రోడ్డు కింద కనిపించకుండా పోయిన తమ కుటుంబీకుల సమాధులను చూసేందుకు పలువురు స్వయంగా తరలివచ్చారు. తమ పూర్వీకుల సమాధులు ఇక్కడే ఉండేవంటూ వెతుకుతూ ‘అధికార’ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. సమాధులు ఎక్కడ ఉన్నాయో తెలవడం లేదని.. అభివృద్ధి పేరుతో రోడ్డువేసి రాళ్లతో రివిట్మెంట్ నిర్మించారని.. తమ వారిని స్మరించుకునే అవకాశం లేకుండాపోయిందని బోరుమన్నారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని మంత్రికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. అప్పుడు అడ్డుకుంటే పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. మా నమ్మకాలను వమ్ము చేయడమే కాకుండా.. మా మనోభావాలను కించపరిచేలా రాజకీయాలు చేస్తున్నారా అంటూ మాపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


