
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ ధర్నా
ఆదోని రూరల్: తనను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగేరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసినిగౌడ్ ఊరఫ్ రామకృష్ణ(24) అనే ట్రాన్స్జెండర్తో పరిచయం ఏర్పడి, సహజీవనం చేస్తూ వచ్చాడు. గతేడాది గణేష్కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి రావడంతో 2024 జూన్ 10న బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసినిగౌడ్ నిరసన తెలిపింది. ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసముంటున్న హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు హాసినిగౌడ్ అక్కడ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే మరలా బుధవారం వచ్చి బైచిగేరిలో గణేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ‘‘నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం.. నువ్వు లేనిదే నేను లేనంటూ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్జెండర్. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పాను. అయినా వినకుండా, తననే పెళ్లి చేసుకుంటాని వెంట బడ్డాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మా ఇంటి నుంచి రూ.5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది. తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్పై ఇదివరకే కేసు హైదరాబాద్లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు.