
కుందూనదిలో మునిగి యువకుడి మృతి
కోవెలకుంట్ల: రేవనూరుకు చెందిన ఓ యువకుడు గొర్రెలు మేపుకునేందుకు వెళ్లి బుధవారం ప్రమాదశాత్తు కుందూనదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బాలుడు, లక్ష్మీదేవి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు జయవర్ధన్(20) పదవ తరగతి వరకు విద్యనభ్యసించి మధ్యలో చదువు మానేశాడు. గొర్రెల కాపరిగా ఉంటూ తల్లిదండ్రులకు చేదోడు వాడోడుగా ఉంటున్నాడు. ఉదయం మరో ఇద్దరు యువకులతో కలిసి గొర్రెలు మేపుకునేందుకు రేవనూరు– కలుగొట్ల గ్రామాల మధ్య ప్రవహిస్తున్న కుందూనది వైపు వెళ్లారు. నది ఆవతలి ఒడ్డుకు గొర్రెలను తోలుకపోయే క్రమంలో ముగ్గురు నదిలో దిగారు. జయవర్ధన్ లోతు ఎక్కువ ఉన్న వైపు వెళ్లి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. మిగిలిన యువకులు పెద్దగా కేకలు వేయడంతో పక్క పొలాల్లో ఉన్న రైతులు నదిలో దిగి గాలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు రేవనూరు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.