 
															కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తిప్పర్తి, మాడుగులపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తిప్పర్తి, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె.. ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి పరిశీలించారు. ఆయా చోట్ల రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తిప్పర్తిలో రైతులు తమ ధాన్యం కాంటా వేసి మూడు రోజులు అయ్యిందని, లారీలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ధాన్యం బస్తాలు మొలకెత్తాయని కలెక్టర్కు వివరించగా వెంటనే స్పందించిన ఆమె కొనుగోలు కేంద్రం నిర్వాహకుడికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని, కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిచాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారిపోయిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన రైస్ మిల్లులతో సమన్వయం చేసుకుని ధాన్యం దించుకునేలా చూడాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డిని ఆదేశించారు. కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్, డీఎం గోపికృష్ణ, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొర్రీలు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలి
మిర్యాలగూడ : ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యానికి ఎటువంటి కొర్రీలు పెట్టకుండా త్వరగా దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పరిధిలోని రామకృష్ణ రైస్ మిల్లును పరిశీలించి మిల్లర్లతో మాట్లాడారు. వానాకాలం సీజన్లో సన్న ధాన్యంతోపాటు ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వస్తున్నందున మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా త్వరితగతిన దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం స్టోరేజీ విధానాన్ని, డ్రై చేసే విధానాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ను అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ ధాన్యాన్ని స్టోరేజీ చేస్తున్న విధానాన్ని గోదాముల్లో ఆమె పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడు జి.రామశేఖర్, కార్యదర్శి పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, తహసీల్దార్ సురేష్కుమార్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
 
							కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
