
సంక్షేమం.. గాడిన పడేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఏళ్ల తరబడి ఇన్చార్జి అధికారులతో నెట్టకొచ్చిన సంక్షేమ వసతిగృహాలకు ప్రభుత్వం కొత్తగా హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13 హాస్టళ్లు మినహా అన్ని వసతి గృహాలకు అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పూర్తిస్థాయిలో లేక ఉన్నవారిలో ఒకొక్కరు రెండు మూడు హాస్టళ్లకు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వచ్చింది. వారు రోజూ హాస్టళ్లకు వెళ్లలేకపోవడంతో వంట మనుషులపైనే ఆధారపడాల్సి వచ్చేంది. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడింది. వారు ఏమి చదువుతున్నారో కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయేది. హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో వసతి గృహాలు గాడిలో పడతాయని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
20 ఏళ్ల తర్వాత నియామకాలు
హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రిటైర్డ్ అవ్వడమే తప్ప 20 ఏళ్లుగా కొత్తగా రిక్రూట్మెంట్ కాలేదు. దీంతో ఇప్పటి వరకు హాస్టళ్లు ఇన్చార్జిలతో కొనసాగాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉండగా.. ఇప్పటివరకు 29 మంది మాత్రమే వార్డెన్లు ఉండేవారు. వారిలో ఒకొక్కరికి 2 నుంచి 3 హాస్టళ్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బీసీ, ఎస్టీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండేది. ప్రతి వార్డెన్ రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం సమయాల్లో హాస్టల్కు వెళ్లి అన్నీ చూసుకోవాలి. మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో ఉండడంతో.. రెండు పూటల మాత్రం హాస్టల్కు వెళ్లాల్సిందే. కానీ ఒక్కో అధికారికి మూడు హాస్టళ్లను అప్పజెప్పడంతో ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్తో పోస్టులను భర్తీ చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు చాలా వరకు కొత్తగా అధికారులు వచ్చారు.
ఎస్సీలో 31 మంది కొత్తగా అలాట్..
జిల్లాలో 61 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండగా గతంలో 29 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉండేవారు. ప్రస్తుతం కొత్త రిక్రూట్మెంట్ ద్వారా 5వ జోన్కు ప్రభుత్వం 54 మంది అలాట్ చేసింది. వారిలో నల్లగొండ జిల్లాలో 31 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు జోన్ 5 పరిధిలోని యాదాద్రి, సూర్యాపేట, జనగాం జిల్లాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం దామరచర్ల మినహా అన్ని హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు.
బీసీలో 13 మంది నియామకం
జిల్లాలో 46 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉండగా మొన్నటి వరకు 27 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. కొత్తగా 13 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో 40 హాస్టళ్లకు అధికారులు ఉన్నారు. ఆరు హాస్టళ్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో ఐదుగురి చేరిక
జిల్లాలో 42 గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 14 ఆశ్రమ పాఠశాలలు. అయితే వీటి పరిధిలో ఆశ్రమ పాఠశాలల హెడ్మాస్టర్లే వార్డెన్లుగా వ్యవహరిస్తారు. మరో 17 హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. 11 హాస్టళ్లకు అధికారులు లేరు. కొత్త రిక్రూట్మెంట్తో జిల్లాకు ఏడుగురిని అలాట్ చేయగా అందులో ఐదుగురు మాత్రమే విధుల్లో చేరారు. ఇద్దరు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో ఉన్నందున వారు విధుల్లో చేరలేదు. దీంతో ఇంకా ఆరు హాస్టళ్లకు ప్రస్తుతం అధికారులు లేరు.
ఏళ్ల తరబడి ఇన్చార్జిలతోనే సగం వసతిగృహాలు
ఫ ప్రస్తుతం 13 మినహా అన్ని హాస్టళ్లకు
సంక్షేమ అధికారుల నియమాకం
ఫ పర్యవేక్షణ పెరుగుతుందని
తల్లిదండ్రుల ఆశాభావం
వంట మనుషులతోనే నిర్వహణ..
ఇన్చార్జి బాధ్యతలు ఉన్న చోట వెల్ఫేర్ అధికారి వంటకు సరిపడా బియ్యాన్ని, కిరాణా సామగ్రిని వంట మనుషులకు అప్పగించి వచ్చేవారు. దాంతో వారు వండి విద్యార్థులకు పెట్టేవారు. అధికారి రోజూ ఒక చోటకు వెళ్లాల్సి వచ్చేది. దీంతోపాటు కార్యాలయాల్లో సమావేశాలు, బిల్లులు పెట్టుకునేందుకు కూడా తిరగాల్సిందే. దీంతో వంట మనుషులే హాస్టల్ నిర్వహణ చూసేవారు.