
రేషన్ షాపుల్లో పేరుకుపోతున్న బియ్యం
నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం పోర్టబులిటీ విధానం అమలవుతుండటంతో పట్టణ ప్రాంతాలకు వలస పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడే రేషన్ బియ్యం తీసుకుంటుండడంతో గ్రామాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం మిగులుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని జూన్లోనే ఇస్తోంది. ఇప్పటికే రేషన్ షాపుల్లో దాదాపు 15 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. వాటిని వెనక్కి తీసుకుపోయే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో డీలర్లు దుకాణాల్లో స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. పాత బియ్యంతో పాటు మిగిలిన సన్న బియ్యం కూడా పురుగుపట్టే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మిగులుతున్న బియ్యం
జిల్లాలో 994 రేషన్ షాపులున్నాయి. వాటి ద్వారా జిల్లాలో 4,84,216 కుటుంబాలకు ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. 3 నెలలకు సంబంధించి సన్న బియ్యం కోటాను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ షాపులకు అలాట్ చేశారు. పంపిణీ ప్రక్రియ కూడా దాదాపు 80 శాతం పైచిలుకు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఒక్కో షాపులో దాదాపుగా 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వచ్చే 2 నెలలు రేషన్ షాపులు బంద్ ఉంటుండడంతో బియ్యం పురుగు పట్టే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు మొత్తం కోటా కాకుండా తగ్గించి పంపాలని డీలర్లు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు కోటా తగ్గించి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ డీఎస్ఓ వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఫ గ్రామీణ రేషన్షాపుల్లో అత్యధిక నిల్వలు
ఫ వలస వెళ్లినవారు పట్టణాల్లో తీసుకోవడమే కారణం
ఫ మూడు నెలల సన్నబియ్యం
కోటా కూడా మిగిలే అవకాశం
ఫ పురుగు పడుతుందని డీలర్ల ఆవేదన
ఫ అవసరాన్ని బట్టి పంపించాలని కోరుతున్న డీలర్లు