
వైద్యులు అందుబాటులో ఉండాలి
నకిరేకల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె నకిరేకల్లోని ఏరియా ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శోభారాణి అందుబాటులో లేకపోవడం, పలు గదులకు తాళాలు వేసి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. క్వాజువాలిటీ, పురుషలు, మహిళ అత్యవసర వార్డులు, మందుల స్టాక్ను తనిఖీ చేశారు. ఇది పీహెచ్సీ కాదని ఏరియా ఆస్పత్రి అని.. డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం రూ.32 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మిస్తున్నందున, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వైద్య సేవలందించాలని సూచించారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ యానాల అశోక్రెడ్డి ఉన్నారు.
టీబీ నివారణపై దృష్టి పెట్టాలి
నల్లగొండ : టీబీ (క్షయ) నివారణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్న్ఫామె అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు టైపాయిడ్, డెంగీ తదితర వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని చెప్పారు. రైతులు ఎరువులకు ఇబ్బంది పడకుండా చూడాలని వ్యవసాయ అధికారిని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, జిల్లా అటవీశాఖాధికారి రాజశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఏఓ శ్రవణ్కుమార్, డీపీఓ వెంకయ్య, హార్టికల్చర్ డీడీ అనంతరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి