
హోర్డింగ్లను తక్షణమే తొలగించాలి
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని నేషనల్ హైవే డివైడర్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.యుగంధర్ శనివారం మిర్యాలగూడ ఆర్అండ్బీ డీఈ శ్రీనివాస్ను ఆదేశించారు. ఈనెల 19న ‘సాక్షి’లో ‘హైవేపై అనధికారిక ప్రకటనలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన నేషనల్ హైవే –167, ఆర్అండ్బీ అధికారులు నేషనల్ హైవే పరిధిలోని డివైడర్ల మధ్య ఎలాంటి ప్రచార హోర్డింగ్స్ ఏర్పాటు చేయొద్దని, వాటి వల్ల వాహనదారుల దృష్టి మరలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. హైవే నిబంధనలు, రోడ్డు భద్రత దృష్ట్యా మున్సిపల్ అధికారులు ఎలాంటి టెండర్లు ఆహ్వానించవద్దని, ప్రస్తుతం ఉన్న బోర్డులను వెంటనే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రకటన ఏజెన్సీలతో అవగాహన ఒప్పందం ఉంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు.