
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
నడిగూడెం: బైక్ అదుపుతప్పి గుంతలో పడడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మోతె మండలం మామిళ్లగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం నారాయణగూడేనికి చెందిన చింత శ్రీకాంత్(27) మునగాల నుంచి మోతె మీదుగా ఖమ్మంకు బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఖమ్మం–సూర్యాపేట రహదారిపై మోతె మండలం మామిళ్లగూడెం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రహదారి వెంట ఉన్న గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని..
మర్రిగూడ: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన యాచారం శ్రీరాములు(55) అదే గ్రామానికి చెందిన బోయపల్లి శంకర్ వద్ద డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీరాములు శుక్రవారం సంగారెడ్డిలో డీసీఎంలో బొగ్గు లోడ్ చేసుకుని తిరిగి వస్తుండగా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వచ్చి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీరాములు రెండో కుమారుడు కూడా 2నెలల క్రితం నాంపల్లి మండల కేంద్రం నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తండ్రి, కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
నార్కట్పల్లి: వేర్వేరుగా చోరీలను పాల్పడిన ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 22న ఎల్లారెడ్డిగూడెంలో జరిగిన ద్విచక్ర వాహనం చోరీ కేసులో నల్లగొండ మండలం శేషమ్మగూడెం గ్రామానికి చెందిన గాదరి సూర్యను, ఈ నెల 12న చెర్వుగట్టులో కుట్టు మిషన్ చోరీ కేసు కేసులో అదే గ్రామానికి చెందిన కసార్ల శివకుమార్ను నార్కట్పల్లి ఫ్లైఓవర్ అరెస్ట్ చేసి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుళ్లు గిరిబాబు, సత్యనారాయణ, శివశంకర్, తిరుమల్ను జిల్లా ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు.
బోర్వెల్ వాహనంలో
డీజిల్ చోరీ
నకిరేకల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బోర్వెల్ వాహనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వాసవీనగర్లో సామ శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. తన బోర్వెల్ వాహనాన్ని ఆ ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అతడు కుటుంబంతో కలిసి స్థానిక పద్మానగర్ జంక్షన్ వద్ద నివాసముంటున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా కారులో బోర్వెల్ వాహనం వద్దకు వచ్చి డీజిల్ ట్యాంక్కు వేసిన తాళాలు పగులగొట్టి సుమారు 300 లీటర్ల డీజిల్ దొంగిలించి పరారయ్యారు. చుట్టుపక్కల వారు శ్రీనివాస్రెడ్డికి సమాచారం ఇవ్వడంతో అతడు వాహనం వద్దకు చేరుకుని పరిశీలించి, అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.