
విజ్ఞానంతో సామాజిక అంతరాలు దూరం
భువనగిరిటౌన్: సమాజంలో విజ్ఞానం ద్వారా మాత్రమే సామాజిక అంతరాలు దూరమవుతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం స్థానిక వెటర్నరీ శాఖ సమావేశం హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే చోటు నాలెడ్జ్ సెంటర్ మాత్రమే అని అన్నారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్ల సామాజిక ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. నాలెడ్జ్ సెంటర్ ద్వారా భవిష్యత్ తరాలకు మంచి విజ్ఞానాన్ని అందించాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ.. సమాజంలో సామాజిక పరివర్తన తీసుకురావడం కోసం పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నిత్యం దినపత్రికలు చదవాలని అన్నారు. నాలెడ్జ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కావాలని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ మాట్లాడుతూ.. నాలెడ్జ్ సెంటర్లను ప్రోత్సహించేందుకు తప్పకుండా సహకారం అందిస్తామని అన్నారు. నాలెడ్జ్ సెంటర్కు ప్రతిరోజు దినపత్రికలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. బానోతు భాస్కర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ ఎస్. మల్లారెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ కౌన్సిలర్ ఈరపాక నర్సింహ, సంతోషిమాత దేవాలయ కమిటీ సభ్యుడు నాగరం శంకర్, మాజీ కౌన్సిలర్ బట్టుపల్లి అనురాధ, నిర్వాహకులు స్వరూప, సురుపంగ శివలింగం, దొడ్డి యాదగిరి, బొట్ల రమేష్, నాయకులు ఇటుకల దేవేందర్ మాదిగ, మేడి కోటేష్, రాము, అందె సాయి, రమేష్ కోటి, ఎస్. జైపాల్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. సత్తయ్య, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజునాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్నాయక్, నర్సింహనాయక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య