
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
కట్టంగూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో కాలం గడుపుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లోనైనా రైతులకు రావాల్సిన రైతు భరోసా పూర్తిగా అందజేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి తెలంగాణ ఏమైనా సీఎం జాగీరా అని ప్రశ్నించారు. గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి.. మిగతావి ఏపీ ఎన్ని నీళ్లయినా దోచుకుపోవచ్చని సీఎం చెప్పటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అజ్ఞానంతో తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం తన చిల్లర మాటలతో రాష్ట్ర ప్రజల ముందు పరువు తీసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పోగుల నర్సింహ, నోముల వెంకటేశ్వర్లు, శ్రీపాద రామకృష్ణాచారి, పోగుల నర్సింహ, అంజయ్య, మల్లేష్ ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య