
కేతేపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
నల్లగొండ: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కేతేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర్లు కేతేపల్లిలోని ఇంటి నంబర్ 2– 97/1 కు సరైన పత్రాలు లేకుండానే నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసి, విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానాన్ని వదిలి వెళ్లకూడదని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు.
భూగర్భ శాస్త్రం.. అవకాశాల పెన్నిధి
నల్లగొండ టూటౌన్: విద్యార్థుల బంగారు భవిష్యత్కు భూగర్భశాస్త్రం అవకాశాల పెన్నిధి అని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఎంజీ యూనివర్సిటీలోని భూగర్భ శాస్త్ర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. భూగర్భ శాస్త్రంలో రాణించిన విద్యార్థులకు జియాలజిస్ట్, హైడ్రోజియాలజిస్ట్, మైనింగ్ జియాలజిస్ట్, జియోసైంటిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, వై.ప్రశాంతి, కె.ప్రేమ్ సాగర్, ఆంజనేయులు, మధుసూదన్రెడ్డి, మచ్చేందర్ పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత పాటించాలి
నాంపల్లి: కిష్టరాయిన్పల్లి రిజర్వాయర్ పనుల్లో నాణ్యత పాటించాలని నల్లగొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత అధికారులకు సూచించారు. నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం గ్రామంలో చేపట్టిన కిష్టరాయిన్పల్లి రిజర్వాయర్ పనులు, ప్రాజెక్ట్ పరిధిలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. త్వరలోనే రైతులందరి భూములకు పరిహారం అందేవిధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్లో ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పనులకు ఆటంకం కలిగించొద్దని చెప్పారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్సీ, చండూర్ డివిజన్ ఇన్చార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డీఈ జాన్నాయక్, తహసీల్దార్ దేవసింగ్, సిబ్బంది ఉన్నారు.
ఇబ్రహీంపేటలో ఎన్ఎస్పీ భూముల సర్వే
హాలియా : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ భూములను రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు శుక్రవారం సర్వే చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేశాల మేరకు హాలియా ఇన్చార్జ్ తహసీల్దార్ రఘు ఆధ్వర్యంలో మిర్యాలగూడ డివిజన్ సర్వేయర్ పోకల విజయ్తో పాటు మరో 9మంది సర్వేయర్లు కలిసి సర్వే చేపట్టారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 16, 17, 68, 72, 482, 484, 485, 486, 490, 491లలో ఉన్న సుమారు 105 ఎకరాల భూమిని సర్వే చేశారు. కాగా ఎన్ఎస్పీ భూములను సర్వే చేసే సమయంలో తమ భూముల సర్వే చేస్తున్నారని భావించిన సన్న, చిన్నకారు రైతులు సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటుండగా పోలీసులు, అధికారులు వారికి సర్ది చెప్పారు. ఎన్ఎస్పీ భూముల సర్వే పోలీసుల పహారా మధ్య జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హాలియా సీఐ సతీష్రెడ్డి నేతృత్వంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. కార్యక్రమంలో హాలియా సీఐ సతీష్రెడ్డి, ఆర్ఐ నవీన్కుమార్, సర్వేయర్లు సైదులు, రామనర్సు, స్వప్న, రాణా ప్రతాప్, శ్రీనివాస్, ముత్తయ్య, జైహింద్, విప్లవ జ్యోతి, పోలీసులు తదితరులు ఉన్నారు.

కేతేపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

కేతేపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్