
ఇంటర్లోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి
నల్లగొండ : బాలికలు ఇంటర్ స్థాయిలోనే మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం ఆమె నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి సందర్భంగా మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. ఏ పాఠశాల నుంచి వచ్చారని? పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయని ? జీవితంలో మీ ఆశయాలు ఏంటి? అని కలెక్టర్ ప్రశ్నించారు. ఇంజనీరింగ్లో మంచి కోర్సులు సంపాదించేందుకు, భవిష్యత్లో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన మెళకువలను బోర్డుపై రాసి వివరించారు. కళాశాలలో నూతన ప్రవేశాలు, విద్యార్థుల సంఖ్య, కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రిన్సిపాల్ సుధారాణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థినులకు డిక్షనరీలను అందజేశారు. కళాశాలలో ఖాళీ స్థలంలో విద్యార్థినులు చదువుకునేందుకు గాను షెడ్ నిర్మాణానికై స్థలాన్ని పరిశీలించారు.
పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం
స్వయం సహాయక మహిళా సంఘాలు పరిశ్రమల యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్లగొండలోని టీటీడీసీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులు ఇందిరా మహిళా శక్తి సంఘాలుగా ఏర్పాటై వివిధ రకాల యూనిట్ల తో పరిశ్రమల ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే రుణాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఏపీడీ శ్రవణ్కుమార్, అలీప్ సంస్థ సెక్రటరీ పద్మజ, కమిటీ సభ్యురాలు పద్మావతి, సీనియర్ ప్రోగ్రాం అధికారి లక్ష్మీప్రియ, ప్రోగ్రాం ఆఫీసర్ శ్యాంసుందర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి