
నార్కట్పల్లి డిపోకు పెరగని బస్సులు
బస్సులను పెంచేందుకు
ఆదేశాలు రాలేదు
నార్కట్పల్లి డిపోలో బస్సుల సంఖ్య పెంచాలని పైఅధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్త రూట్లు ఏర్పాటు చేస్తే బస్సులను పెంచే ఆలోచన ఉంటుంది. నల్లగొండ డిపోలో సర్వీస్ అయిపోయిన బస్సులను తొలగించి ఎలక్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. నల్లగొండ డిపోలో కరెంట్ పనులు పూర్తయ్యాక చార్జింగ్ బస్సులను ప్రారంభిస్తాం.
– శ్రీనాథ్, నార్కట్పల్లి
ఇన్చార్జి డీఎం
నార్కట్పల్లి : నిజాం కాలంలో ఏర్పాటైన నార్కట్పల్లి బస్సు డిపో.. నేడు అవసాన దశలో ఉంది. రెండేళ్ల క్రితం వరకు ఈ డిపోలో 67 బస్సులు ఉన్నాయి. వీటిలో 2 సూపర్ లగ్జరీ, 11 ఎక్స్ప్రెస్, 54 పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి. డిపోలో ఉన్న కొన్ని సర్వీస్ల వల్ల నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు డిపోలోని బస్సులను జిల్లాలోని ఇతర డిపోలకు పంపారు. సిబ్బందిని సర్దుబాటు చేశారు. డిపో తొలగిస్తారనే ప్రచారం కూడా సాగడంతో.. ఆ పార్టీల నేతలు ఆందోళనలు చేయడంతో బస్సులను పూర్తిగా తొలగించకుండా కేవలం 15 బస్సులతో కొనసాగిస్తున్నారు.
నల్లగొండ డిపో బస్సులు ఇక్కడికి వస్తాయని..
ఇటీవల నల్లగొండ డిపోకు దాదాపు 40 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. అక్కడ స్థలం లేక వాటిని నార్కట్పల్లి డిపోలు ఉంచారు. నల్లగొండలో చార్జింగ్ పాయింట్ ప్రారంభిస్తే.. నల్లగొండ డిపోలో స్థలం సరిపోదు. నల్లగొండ డిపోలో డీజిల్తో కొనసాగే సర్వీలను నార్కట్పల్లి డిపోకు పంపుతారని దాంతో నార్కట్పల్లి డిపోకు పూర్వ వైభవం వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.