
పేదలకు అండ.. ఎర్రజెండా
మిర్యాలగూడ : పేదలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మండల 9వ మహాసభలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఏర్పడిన వంద సంవత్సరాల కాలంలో పేదల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడిందన్నారు. సీపీఐ చేసిన త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. స్థానిక ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, యాదాద్రి పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందించడంతోపాటు ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాద్యక్షుడు ఎండీ.సయ్యద్, మండల అధ్యక్షుడు ధీరావత్ లింగానాయక్, అంజనపెల్లి రామలింగం, జిల్లా యాదగిరి, నాయకులు జమ్మల కోటయ్య, శాంతి, పోలేపల్లి ఉదయ్, బుజ్జి లింగానాయక్, పోలేపల్లి మమత, లక్ష్మయ్య, రవి, అన్నపూర్ణ, నిర్మల, వెంకటయ్య పాల్గొన్నారు.