
సామాన్యులకు అర్థమయ్యేలా శ్రీశ్రీ రచనలు
నాగార్జునసాగర్ : విప్లవ కవిగా సామాజిక సందేశాలతో సామాన్యులకు అర్థమ్యే రీతిలో సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు చేరవేసిన అభ్యుదయ కవి శ్రీశ్రీ అని ప్రముఖ గాయకుడు, కవి, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య అన్నారు. ఆదివారం మహాకవి శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా నందికొండ మున్సిపాలిటీలోని హిల్కాలనీలో దాసి సుదర్శన్ స్మారక చిత్రకళ నిలయంలో ఏర్పాటు చేసిన ‘సాహిత్యం–సమకాలీనత’ అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడ భావజాలాన్ని, భాష, సాహిత్యాన్ని ముందుతరం వారికి తెలిపేందుకు వచ్చిన గొప్ప కవి శ్రీశ్రీ అన్నారు. కమ్యునిజం భావజాలంతో వచ్చే కవితైనా, కళ అయినా చిత్రకళ అయినా భావితరాలకు ఎర్రజెండాలా రెపరెపలాడుతూ ఉంటుందన్నారు. అనంతరం మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం శ్రీశ్రీ సొంత దస్తూరితో కార్టూన్లతో ఉన్నటు వంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమూహ కవి, రచయిత ప్రభాకర్ కస్తూరి, కార్టునిస్ట్ నర్సింహ, రామలింగయ్య, రామ్మోహన్, రాజు, తిరుమల, స్వతంత్ర, కిరణ్మయి, పాండు, మున్నా, జగన్మోహన్, బాలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.