నల్లగొండ : జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఈ బృందం ఈనెల 20 నుంచి 24 వరకు జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రతో సమావేశమై వారు అధ్యయనం చేసిన ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పలువురు శిక్షణ అధికారులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వైద్య సదుపాయాలు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశాన వాటికలు, నర్సరీలు, ధాన్యం సేకరణ తదితర పథకాలు బాగున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, శిక్షణ నిర్వాహకులు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
ఫ సెంట్రల్ సెక్రటేరియట్ శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు