కందనూలు: జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, ఉపకేంద్రాల్లో అందిస్తున్న సేవలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించడంతోపాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మాతాశిశు ఆరోగ్యంపై అధికారులు దృష్టిసారించాలని, గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, ప్రసవానికి ముందు, తర్వాత అవసరమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలను ముందుగానే అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యా ల సాధనలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సి బ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కృష్ణ, ఇ మ్యూనైజేషన్ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.


