
కానరాని పల్లెవెలుగు!
‘ఈ చిత్రంలోని ప్రైవేటు వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నది బల్మూర్ మండలం రామోజీపేట గ్రామ విద్యార్థులు. ఈ మండలంలో మెజార్టీ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. మైలారం, అంబగిరి, నర్సాయపల్లి, రామోజీపల్లి, వీరాన్రాజుపల్లి, చెన్నారం గ్రామాల ప్రజలకు ఆటోలు, జీపులే దిక్కు. ఎక్కడికై నా వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిందే. ఇక విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం.’ .. ఇలా జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యానికి నోచుకోక అవస్థలు పడుతున్నారు.
మెజార్టీ గ్రామాలకు చేరని ప్రగతిచక్రం
ఉచిత బస్సు ప్రయాణానికి దూరం..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం గ్రామీణ మహిళలకు అందని ద్రాక్షగా మారింది. తమ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే, ఆర్టీసీ జిల్లాలోని మెజార్టీ రూట్లలో అద్దె బస్సులనే వినియోగిస్తోంది. అయితే అద్దె బస్సుల నిర్వాహకులు లాభదాయకమైన రూట్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంతో చాలా వరకు గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండటం లేదు. ఒక్కో మండలంలో ఐదు నుంచి పది గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం అందుతుండగా.. మిగతా రూట్లలో ఆటోలు, జీపులే దిక్కవుతున్నాయి. అన్ని రూట్లలో అనుకూలమైన వేళల్లో బస్సులు నడుపుతూ.. ప్రైవేటు వాహనాలను నియంత్రిస్తే ఆక్యూపెన్సీ పెరిగే అవకాశం ఉండగా.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు ఆర్టీసీ డిపోలు ఉండగా.. ఒక్కో డిపో నుంచి ఏడాదికి సుమారు రూ. 8కోట్ల వరకు లాభం ఆర్జిస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని అనేక గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడం.. గతంలో బస్సు సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సులను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు సైతం ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది.
ప్రైవేటు వాహనాలే దిక్కు..
జిల్లాలోని అచ్చంపేట, లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, కొల్లాపూర్ మండలాల్లో చాలా వరకు గ్రామాల ప్రజలకు ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి, బక్కలింగయ్యపల్లి, సిద్ధాపూర్, లింగాల మండలంలోని చెన్నంపల్లి, అప్పాయిపల్లి, ధారారం, బల్మూరు మండలంలోని మైలారం, రామోజీపల్లి, అంబగిరి, చెన్నారం, అమ్రాబాద్ మండలం తుర్కపల్లి, జంగిరెడ్డిపల్లి, కల్మూలోనిపల్లి, కుమ్మరోనిపల్లి, తిర్మలాపూరం, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, ముక్కిడిగుండం, కుడికిళ్ల, పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మధవానినగర్, ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ ప్రజలకు ఆటోలు, జీపులే దిక్కు
పరిమితికి మించి ప్రయాణంతో ప్రమాదాలు
విద్యార్థులకు తప్పని అవస్థలు

కానరాని పల్లెవెలుగు!

కానరాని పల్లెవెలుగు!