ప్రకృతి వ్యవసాయం దిశగా.. | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయం దిశగా..

Jun 23 2025 6:59 AM | Updated on Jun 23 2025 6:59 AM

ప్రకృ

ప్రకృతి వ్యవసాయం దిశగా..

సహజ సిద్ధమైన ప్రకృతి సేద్యానికిప్రభుత్వ ప్రోత్సాహం

జిల్లాలో 15 క్లస్టర్ల ఏర్పాటు

మొదలైన మట్టి నమూనాల సేకరణ

ఆసక్తి చూపుతున్న రైతులు

అచ్చంపేట రూరల్‌: పంటల సాగులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగింది. వీటిని వినియోగించి పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు తినడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రకృతి సేద్యంతో పండించిన ఆహార పదార్థాలు, కూరగాయల షాపులు వెలుస్తున్నాయి. అయితే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టింది.

ప్రయోగాత్మకంగా 2వేల ఎకరాల్లో..

జిల్లాలో ప్రయోగాత్మకంగా 2వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టేందుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు ప్రోత్సాహం అందించనున్నారు. అయితే జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో 60శాతం నిధులను కేంద్రం భరిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది.

ఒక్కో క్లస్టర్‌లో 125మంది రైతులు..

జిల్లాలోని ప్రతి మండలంలో రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి ఉన్న 125 మంది రైతులను ఎంపికచేసి.. 125 ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపడతారు. రైతులు ఎకరా విస్తీర్ణంలో తమకు నచ్చిన పంట సాగు చేయవచ్చు. అది పూర్తిగా ప్రకృతి సేద్యం విధానాల ద్వారా మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. కూరగాయలు, పప్పు దినుసులు పండిస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15 క్లస్టర్లలో 2వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టనున్నారు.

విధిగా భూసార పరీక్షలు..

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి ఎంపిక చేసిన రైతుల భూమి నుంచి మట్టి నమూనాలు సేకరించి.. భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నివేదికలకు అనుగుణంగా భూమిలో ఉన్న లోపాలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటారు. పంటల సాగుకు జీవామృతం, ఘన జీవామృతం, పచ్చిరొట్ట, వివిధ ఆకుల కషాయాలు, అగ్నిఅస్త్రం తదితర ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ఎరువులను వినియోగించాల్సి ఉంటుంది. వీటి తయారీ కోసం రైతులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. సాగు పద్ధతులు, సేంద్రియ ఎరువులు వినియోగించే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి క్లస్టర్‌కు కృషి సఖి లేదా కమ్యూనిటీ రీసోర్స్‌ పర్సన్లు ఇద్దరు ఉంటారు. వీరు నెలలో 16 రోజులు సేంద్రియ సాగు చేస్తున్న క్షేత్రాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తారు. ఆయా గ్రామాలకు చెందిన స్వయం సహాయ సంఘాల్లో సభ్యురాళ్లను కృషి సఖి, రీసోర్స్‌ పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపించే రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో ఈ ఎంపిక పూర్తి చేస్తారు.

సొసైటీలు, ఎన్జీఓల ద్వారా బయో రీసోర్స్‌ సెంటర్లు..

రైతులకు జీవామృతం లాంటివి తయారు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం రూ. 4వేల చొప్పున రెండేళ్లకు ప్రభుత్వం రూ. 8వేలు అందిస్తుంది. జీవామృతం తయారు చేసుకోలేని వారు బయో రీసోర్స్‌ సెంటర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 10 బయో రీసోర్స్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆసక్తి గల వారు రీసోర్స్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలు త్వరలోనే వ్యవసాయశాఖకు అందే అవకాశం ఉంది.

అవగాహన కల్పిస్తాం..

జిల్లాలో ఏర్పాటుచేసిన క్లస్టర్లలో ప్రకృతి సేద్యంపై ఆసక్తిగల రైతులను గుర్తిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా శిక్షణనిస్తాం. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పకడ్బందీగా మట్టి నమూనాలు సేకరించి ఏ పంటకు అనుకూలమో తెలియపరుస్తాం. ఇప్పటికే ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు మట్టి నమూనాల సేకరణలో నిమగ్నమయ్యారు. – చంద్రశేఖర్‌, డీఏఓ

ప్రకృతి వ్యవసాయం దిశగా.. 1
1/1

ప్రకృతి వ్యవసాయం దిశగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement