
రైతుభరోసా @ రూ.372 కోట్లు
నాగర్కర్నూల్: రైతుభరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 2,89,015 మంది రైతుల ఖాతాల్లో రూ. 372.215 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకం సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి పునాది వేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది రైతులకు ఈ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వట్టెం వెంకన్న సన్నిధిలో కలెక్టర్..
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం కలెక్టర్ బదావత్ సంతోష్ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చక బృందం వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు, కుటుంబ సభ్యులతో అర్చకులు గోత్రనామార్చన పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు.