బడికి పోదాం.. చలో చలో | - | Sakshi
Sakshi News home page

బడికి పోదాం.. చలో చలో

Jun 12 2025 3:29 AM | Updated on Jun 12 2025 3:29 AM

బడికి పోదాం.. చలో చలో

బడికి పోదాం.. చలో చలో

సాక్షి, నాగర్‌కర్నూల్‌/కందనూలు: జిల్లాలోని పాఠశాలలు పునఃప్రారంభానికి ముస్తాబయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పాఠశాలలను సుందరంగా అలంకరించారు. విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. బుధవారం శానిటేషన్‌ పనులు ముమ్మరంగా చేపట్టారు. పాఠశాలల పరిసరాలతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. తాగునీటి వసతులను పరిశీలించి, అవసరమైన వాటికి మరమ్మతు చేయించారు. పండగ వాతావరణంలో బడుల్లో విద్యాబోధన చేపట్టేందుకు వీలుగా పరిశుభ్రత, ఆహ్లాదానికి ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయులు పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు.

● విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు ఇప్పటికే జిల్లాకు చేరగా.. డీఈఓ పర్యవేక్షణలో వాటిని ఆయా మండలాలకు చేరవేశారు. అక్కడి నుంచి పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు మొదటి రోజు నుంచే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ పంపిణీ చేపట్టనున్నారు. అయితే అనేక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల పనులు ఇంకా పూర్తి కాలేదు. కాగా, బడిబాట కార్యక్రమంలో ఇప్పటి వరకు 2,311 మంది విద్యార్థులను చేర్పించారు.

3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం

జిల్లాలో 560 ప్రాథమిక, 126 ప్రాథమికోన్నత, 153 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 54,898 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మొత్తం 3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. ప్రస్తుతం జిల్లాకు 3,65,370 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. మిగిలిన పుస్తకాలను కూడా త్వరలో జిల్లాకు తెప్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 56,733 యూనిఫామ్స్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడ త్వరలో సిద్ధం చేయనున్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్‌ కుట్టే బాధ్యతను గ్రామాల్లో సెర్ప్‌, అర్బన్‌లో మెప్మాకు అప్పగించిన విషయం తెలిసిందే.

ఈసారి సరికొత్తగా విద్యాబోధన..

ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో అదనపు అంశాలతో విద్యార్థులకు విద్యాబోధన కొనసాగనుంది. అధునాతన సాంకేతికత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రాథమిక స్థాయి నుంచే ఆయా సబ్జెక్టుల్లో అభ్యసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రాథమిక స్థాయిలోనే తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించడంతో పాటు వారికి ఏఐ ఆధారిత అభ్యసన కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. ఇందుకోసం ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఐదు వరకు కంప్యూటర్లను సమకూర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు..

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. జిల్లాకు చేరిన పుస్తకాలను ఇప్పటికే పాఠశాలలకు పంపించాం. మిగిలిన పుస్తకాలను కూడా త్వరలో తెప్పిస్తాం.

– రమేశ్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

విద్యార్థుల రాకకోసం

సర్కారు బడుల ముస్తాబు

మౌలిక వసతుల కల్పనలోఅధికారుల నిమగ్నం

పండుగ వాతావరణంలో విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement