
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాలి
నాగర్కర్నూల్: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్తో పాటు వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రాంబాబు నాయక్, రేణికుంట్ల ప్రవీణ్తో కలిసి చైర్మన్ సమావేశమై.. అట్రాసిటీ కేసుల దర్యాప్తులో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆయన సమీక్షించారు. ముఖ్య ప్రణాళికాధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టవద్దన్నారు. ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, కులాంతర వివాహాలు, అంబేడ్కర్ విద్యా పథకం తదితర వాటిపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ)ని వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్షతను నిరోధించడానికి, వారి హక్కులను రక్షించడానికి జిల్లాలో పకడ్బందీగా పౌరహక్కుల దినోత్సవాన్ని విరివిగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న కలెక్టర్, విద్యాశాఖ అధికారిని చైర్మన్ అభినందించారు.
● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు వంటి వివరాలను కమిషన్ చైర్మన్కు కలెక్టర్ వివరించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలతో జిల్లా రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కోటా మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి చైర్మన్ గౌరవ వందనం స్వీకరించారు. అదే విధంగా పలువురు వివిధ సమస్యలపై చైర్మన్కు వినతిపత్రాలు సమర్పించారు.
అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
నిధులు పక్కదారి పడితే సహించం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య